600కు 600 మార్కులా..! గర్వంగా ఉంది.. ఏ సాయం కావాలన్నా అడుగమ్మా: సీఎం స్టాలిన్
తమిళనాడు ప్లస్ టూ ఫలితాల్లో 600లకు 600 మార్కులు సాధించి భళా అనిపించిన విద్యార్థిని ఎస్.నందినిని ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) అభినందించారు.
హయ్యర్ సెకెండరీ బోర్డు పరీక్షల్లో తన సత్తాచాటిన విద్యార్థిని ఉన్నత చదువులకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్లస్ టూలో ఆరు సబ్జెక్టులకు నూరు శాతం మార్కులతో అదరగొట్టిన నందిని ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని కలిసి మాట్లాడిన స్టాలిన్.. నందినిని చూసి గర్వపడుతున్నట్టు పేర్కొన్నారు. తదుపరి చదువులకు గాను ఏ సాయం కావాలన్నా తనను అడగాలని సీఎం సూచించారు.
దిండిగల్లు జిల్లాకు చెందిన నందిని తండ్రి కార్పెంటర్గా పనిచేస్తున్నారు. అన్నామలైయార్ మిల్స్ బాలికల హయ్యర్ సెకెండరీ స్కూల్లో చదివిన విద్యార్థిని తమిళ్, ఇంగ్లీష్, ఎకనమిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆమెకు ఫోన్ చేసి అభినందించిన సీఎం స్టాలిన్ ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం నందిని తన కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం స్టాలిన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బాలికను అభినందించిన సీఎం.. బహుమతులు ఇచ్చారు.
'చదువు ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి' అని చాలా కార్యక్రమాల్లో తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. విద్యనే ఆస్తిలా భావించి చదివానని ఆ బాలిక ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూసి గర్వపడ్డానన్నారు. తాను స్వయంగా ఫోన్ చేసి అభినందించానని.. ప్రభుత్వం తరఫున ఆమె ఉన్నత విద్యకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. టాపర్గా నిలిచిన నందినిని అభినందించిన వీడియోను సీఎం తన ట్విటర్లో షేర్ చేసుకున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నందినిలాంటి వారు తమిళనాడుకు గౌరవ చిహ్నాలని అభివర్ణించారు.
ఆడిటర్ కావాలనుకుంటున్నా..
సీఎం స్టాలిన్ను కలిసిన అనంతరం టాపర్ నందిని విలేకర్లతో మాట్లాడారు. సీఎం స్టాలిన్ను కలవడం, ఆయన నుంచి గిఫ్ట్లు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను సాధించిన విజయం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకే అంకితమన్నారు. ఆడిటర్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
0 Comments:
Post a Comment