Bengaluru: బెంగళూరు వరదల్లో కొట్టుకుపోయిన రూ.2 కోట్ల విలువైన బంగారం, లబోదిబోమంటున్న యజమాని
కొద్దిరోజుల క్రితం బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే.. వరదల వల్ల బెంగళూరులోని ఓ బంగారం దుకాణం తీవ్రంగా నష్టపోయింది.
బెంగళూరులోని మల్లేశ్వర్ ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. చెత్తాచెదారం కలిసిన వరదనీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో.. సిబ్బంది షటర్లు మూయలేకపోయారు. బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే వరద నీరు ముంచెత్తింది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి, సహాయం కోరినా.. స్పందించలేదని మండిపడ్డారు. దాంతో.. వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయిందని వాపోయారు షాపు యజమాని. కొట్టుకుపోయిన బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు. అయితే.. గోల్డ్ షాపు దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనులే ఆకస్మిక వరదకు కారణమని దుకాణం యజమాని ఆరోపించారు.
అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. రహదారుల నిండా చెత్త పేరుకుపోయింది. దానిని తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు 600 వరకు ఫిర్యాదులు అందాయి. అదేసమయంలో.. ఆదివారం కేఆర్ కూడలి సమీపంలోని అండర్ పాస్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్కు చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందింది. అంతేకాదు.. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారని వెల్లడించారు అధికారులు. ఏదేమైనా.. బెంగాళూరులో అకాల వర్షాలు.. ఓ గోల్డ్ షాప్ యజమానిని మాత్రం నిండా ముంచాయి. ఈ నేపథ్యంలో.. భారీగా నష్టపోయిన బంగారం షాప్ యజమానిని నూతన కర్ణాటక ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా లేక సాయం చేయాలని కోరినా స్పందించని మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment