SBI Alert - ఎస్బీఐ అలర్ట్.. దేశంలో స్తంభించిన సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు సోమవారం రోజు (3-4-2023) సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈరోజు 4వ రోజు. మార్చి 31 నుంచి ఎస్బీఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయి. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్లలో పేర్కొంటున్నారు.
మరోవైపు ఎస్బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది.
0 Comments:
Post a Comment