AP CM Jagan : పిల్లలను బడికి పంపేలా అమ్మఒడి.. ఇంటర్మీడియట్ వరకూ వర్తింపు : సీఎం జగన్
AP CM Jagan : పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందన్నారు. ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయని పేర్కొన్నారు.
ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకే డ్రాప్ అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలన్నారు. సోమవారం (ఏప్రిల్10,2023)న క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని సీఎం జగన్ అన్నారు.
సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉందని.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలని సూచించారు. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్షించారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మే15వ తేదీ నాటికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని అధికారులు అన్నారు.
సబ్జెక్టు టీచర్ల పై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టు కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. దీంతో చక్కటి పునాది ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయని తెలిపారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సుల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు ఏర్పాటు చేయాలన్నారు.
రానున్న రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. పిల్లల సంఖ్యకు తగ్గట్లుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై ప్రతేడాది సమీక్ష చేసుకోవాలన్నారు. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. పిల్లలకు ఎక్కడ కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదని సీఎం జగన్ తెలిపారు.
అలాగే ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. పాఠశాల పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సమీక్షించిన సీఎం జగన్.. 3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. 6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించాలని, వీరికి జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్ పరీక్ష నిర్వహించాలని.. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని తెలిపారు. జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ- కంటెంట్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా..వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నెంబరును స్కూల్లో ఉంచాలన్నారు.
విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఓపీ తయారు చేశామని అధికారులు తెలిపారు. ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఎక్కడా కూడా ప్రశ్నాపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. నో మొబైల్ జోన్స్గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్ అనుమతి లేదని తేల్చి చెప్పారు. ప్రశ్నాప్రత్రాల్లో ప్రతీ ప్రశ్నకు క్యూ ఆర్ కోడ్ ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఎక్కడి నుంచి, ఏ సెంటర్ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామని తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్నారు. ఇప్పటికే 1000 ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లను కూడా అఫిలియేట్ చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
0 Comments:
Post a Comment