సీఎం జగన్ మాస్టర్ స్కెచ్ : విశాఖలోనే "సై" - గంటా రాజీనామా ఆమోదం..!?
ఏపీలో మరో ఉప ఎన్నిక తప్పదా. విశాఖలో పట్టు నిరూపించుకొనేందుకు వైసీపీ సిద్దం అవుతోంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది.
పీడీఎఫ్ తో ఒప్పందం...రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టీడీపీ విజయం సాధించింది. దీంతో, విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తమని వైసీపీ చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించటం లేదని ప్రచారం మొదలు పెట్టింది. దీనిని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విశాఖ కేంద్రంగానే తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమచారారం. ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
విశాఖలోనే సమాధానం చెప్పేలా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఉప ఎన్నికలు..స్థానిక సంస్థల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూ గెలుపొందింది. కానీ, గ్రాడ్యుయేట్స్ నియెజకవర్గాలు మూడు స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ విజయాన్ని టీడీపీ భారీగా ప్రచారం చేసుకుంటుంది. రాజధానుల అంశానికి ముడి పెడుతోంది. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని చంద్రబాబు.. పవన్ చెప్పుకొచ్చారు. దీంతో..ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ..రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోనే మరో ఎన్నిక ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని పైన నేడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
గంటా రాజీనామాకు ఆమోదం..?
విశాఖతో పాటుగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, విశాఖ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారుతోంది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన రాజీనామా లేఖ ఇచ్చి ఉన్నారు. 2021, ఫిబ్రవరి 12న గంటా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ అందించారు. ఈ లేఖపై స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగినా..ఇప్పుడు విశాఖ టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదించటం ద్వారా అక్కడ ఉప ఎన్నిక ఎదుర్కోవాలనేది వైసీపీ నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదిస్తే అటు టీడీపీకి ఎమ్మెల్యే తగ్గటంతో పాటుగా విశాఖలో ఉప ఎన్నికలో గెలిచి..తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది.
పొత్తుల పై క్లారిటీ - కొత్త వ్యూహంతో
వైసీపీ నాయకత్వం ఎన్నికకు వెళ్లాలని నిర్ణయిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా ఉప ఎన్నిక జరగాలంటే అసెంబ్లీ కార్యాలయం ఖాళీ నోటిఫై చేసిన తరువాత ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించినా మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక..ఈ ఎన్నిక ద్వారా టీడీపీ -జనసేన పొత్తు పైన స్పష్టత రానుంది. అదే సమయంలో విశాఖలో ఖచ్చితంగా గెలిచి తమ బలం చాటాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి.. అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్లుగా గంటా రాజీనామాను ఆమోదిస్తారా.. ఉప ఎన్నిక జరుగుతుందా అనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment