దాదాపు నాలుగు శతాబ్దాలు ప్రపంచ రాజకీయాలను వారే శాసించారు.. అనేక దేశాలకు తమ పాలనను విస్తరించారు.. భారీ సైనిక శక్తిగా ఎదిగారు..
వారు స్వాధీనం చేసుకున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.. అంతటి అజేయశక్తిగా పేరొందిన ఇంగ్లాండ్ నేడు కేవలం నాలుగు దీవులకే పరిమితమైందంటే కాలవైచిత్రి కాక మరేమిటి? రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రసిద్ధమై ఇతర ఐరోపా శక్తులను అవలీలగా ఎదుర్కొని అనేక దేశాల్లో వలస పాలనను ఏర్పాటు చేసిన ఇంగ్లాండ్ నేడు చిన్నదేశంగా మారింది. మహోగ్ర శిఖరాలపై వైభవోపేతమైన బ్రిటిషు సామ్రాజ్య ప్రభ ఇంతగా తగ్గిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే..
ప్రపంచ భూభాగంలో 25 శాతం వారిదే
16వ శతాబ్దం ప్రారంభం నుంచే ఆంగ్లేయులు అమెరికా.. తదితర ప్రాంతాల్లో వలస రాజ్యాలు నెలకొల్పారు. అయితే 18వ శతాబ్దంలో ఆ వేగం పుంజుకుంది.
ప్రత్యేకించి భారత్లో వారి పాలన ప్రారంభం తర్వాత ప్రపంచ ఆర్థిక మూలాలన్నీ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తొలుత భారత్ను ఆ దేశం పాలించలేదు. ఈస్టిండియా కంపెనీ పాలించింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో నేరుగా బ్రిటన్ రాణి పాలన ప్రారంభించింది.
ఏయే ఖండాల్లో...
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఇలా ఐరోపా మినహాయించి బ్రిటిష్ పాలన కొనసాగింది. ఆ సమయంలో ప్రపంచంలో 23 శాతం మంది ఇంగ్లాండ్ పాలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇతర ఐరోపా శక్తుల రాకతో..
ఇంగ్లాండ్ తరహాలో ఇతర ఐరోపా శక్తులు కూడా ప్రపంచంలో ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలోనే ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.
ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల మధ్య జరిగిన యుద్ధాలతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అతి పెద్ద ఆర్థిక వనరుగా ఉన్న అమెరికా 1774లో బ్రిటన్పై పోరాడి స్వతంత్ర దేశంగా అవతరించింది.
మొదటి, రెండు ప్రపంచయుద్ధాలు..
మొదటి ప్రపంచయుద్ధం (1914-1918), అనంతరం రెండో ప్రపంచయుద్ధం ( 1939-1945) బ్రిటన్ ఆర్థికవ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయి.
అధునాతన యుద్ధతంత్రంలో జరిగిన యుద్ధాల్లో సైనిక వ్యయంతో పాటు మందుగుండు సామగ్రి, విమానాలు, నౌకలకు విపరీతంగా వ్యయం చేయాల్సి వచ్చింది. దీంతో బ్రిటన్ పాలకులు ఆర్థికంగా బలహీనమయ్యారు. అదే సమయంలో వలస దేశాల్లో స్వాతంత్య్ర ఉద్యమాలు బలపడ్డాయి.
చరిత్ర మార్చిన భారత్..
భారత్లో స్వాతంత్య్ర ఉద్యమంతో తెల్లవారు ఇక తాము పాలించలేమని ఆంగ్లేయులు స్వాతంత్య్రం ప్రకటించారు. అయితే దేశాన్ని పాకిస్థాన్, భారత్లుగా విభిజించారు. 1957లో ఆఫ్రికాలో తొలిసారిగా ఘనాకు బ్రిటిషువారి నుంచి స్వాతంత్య్రం వచ్చింది.
1967 కల్లా బ్రిటిష్ పాలనలో ఉన్న దాదాపు 20 దేశాలు ఆంగ్లేయులపై పోరాడి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాయి. అటు బ్రిటన్లోనూ ఉదారవాదులు బలపడి తమ ఆధీనంలో ఉన్న దేశాలకు స్వాతంత్య్రం ప్రకటించారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లు మాత్రమే యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాయి. సుదూరంగా ఉన్న చిన్న చిన్న దీవులైన ఫాక్లాండ్, బెర్ముడా వంటివి వీరి పాలనలో కొనసాగుతున్నాయి.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడాలు బ్రిటన్ రాచరికాన్ని సంప్రదాయంగా అంగీకరిస్తున్నాయి. క్రమక్రమంగా ప్రభను కోల్పోయిన ఇంగ్లాండ్ చిన్నదేశంగా మిగలడం.. నిజంగా రవి అస్తమించని సామ్రజ్యానికి మింగుడు పడని అంశమే.
0 Comments:
Post a Comment