3 రాజధానులపై ముందుకెళ్లేదెలా? ఏపీ సర్కారుకు సమస్యగా సుప్రీంకోర్టు నిర్ణయం
ఈ మధ్య విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్.. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని ప్రకటించారు. కానీ ఆయన ఆశలపై తాత్కాలికంగా నీళ్లు చల్లింది సుప్రీంకోర్టు.
ఏపీ రాజధాని అమరావతి మాత్రమేననీ, రాజధానిపై చట్టం చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లేదని హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అందువల్ల ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి కిందే లెక్క. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చని అంశం. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశంపై ముందుకెళ్లడం ఇబ్బందికరమే.
రాజధాని అంశంపై 2022 మార్చి 3న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతే ఏపీ రాజధాని అని తెలిపింది. దీన్ని ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అటు అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి.. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై మంగళవారం.. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చర్చించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. విచారణను జులై 11కి వాయిదా వేసింది.
ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఓవైపు సీఎం జగన్ .. స్వయంగా తాడేపల్లి నుంచి విశాఖకు షిఫ్ట్ అవ్వాలని రెడీ అవుతున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకుండా.. వెళ్తే.. తీరా తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. అది జగన్కి ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల ఫైనల్ తీర్పు వచ్చాకే షిఫ్ట్ అవ్వాలా లేదా అన్నది నిర్ణయించుకోవడం బెటర్ అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. జులై 11న సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. వెంటనే 3 రాజధానుల ప్రక్రియ ప్రారంభించవచ్చని అంటున్నారు.
ఎన్నికల టెన్షన్ :
జులై 11న 3 రాజధానులపై తీర్పు రావచ్చు లేదా విచారణ మళ్లీ వాయిదా పడవచ్చు. ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే... విచారణ చేపట్టిన ఇద్దరిలో ఒకరైన జస్టిస్ కేఎం జోసెఫ్.. జూన్ 16న రిటైర్ కాబోతున్నారు. అందువల్ల జులై 11న ధర్మాసనంలో జోసెఫ్ బదులు మరో కొత్త జడ్జి వస్తారు. ఆయన మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటానని అంటే.. కథ మొదటికి వస్తుంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర అంశం,
ఆగస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలు మాత్రమే టైమ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం 3 రాజధానుల ప్రక్రియ జోలికి వెళ్తే.. దాని వల్ల వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అంశంపై ఎక్కువ ఫోకస్ పెట్టే వీలు కలగకపోవచ్చనీ, అందువల్ల ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. అప్పుడు 3 రాజధానుల ప్రక్రియపై ముందుకు సాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం ప్రభుత్వానికి సరైన దిశా నిర్దేశం అవుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
0 Comments:
Post a Comment