✍️‘ఏకో’వేదన!
👉2017తో పోలిస్తే 4,900 పెరిగిన ఏకోపాధ్యాయ పాఠశాలలు
👉మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో రెండో స్థానంలో రాష్ట్రం*
*ఈనాడు - అమరావతి*
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వబడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ఒకే ఉపాధ్యాయుడు ఉండే బడుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో ఓ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సమాధానమిచ్చింది. యూడైస్ ప్లస్-2021-22 గణాంకాల ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా 16,630 బడులతో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా.. ఏపీ 12,386 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. 2017లో 7,483 ఏకోపాధ్యాయ బడులతో దేశంలో అయిదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండోస్థానానికి చేరింది. నూతన విద్యావిధానం పేరుతో 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ఏడాది సుమారు 4,600 ప్రాథమిక బడుల నుంచి తరగతులను విలీనం చేశారు. ప్రాథమిక బడుల్లో మిగిలిన ఒకటి, రెండు తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, విలీనంతో కొందరు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోవడంతో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగింది.
*సెలవు పెడితే ఇబ్బందే..*
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పాఠశాల విద్యాశాఖ ఒక్కరినే నియమిస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. కొన్నిచోట్ల 5 తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులనూ బోధిస్తుండగా.. మరికొన్నిచోట్ల 1,2 తరగతులకు బోధిస్తున్నారు. ఇలాంటిచోట ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో బోధన గాడి తప్పుతోంది. గత మూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. ఈ ఏడాది పోస్టులను హేతుబద్ధీకరించారు. ప్రాథమిక పాఠశాలల్లో 20మంది విద్యార్థులకు ఒక టీచర్, 21-60 వరకు రెండో టీచర్ను ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించారు. మరోపక్క ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనల కోసమంటూ గతేడాది 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దుచేశారు. ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఎస్జీటీ టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. తరగతుల విలీనం జరగని చోట కొన్ని బడుల్లో 1-5 తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు.
ఒకే గదిలో బోధన..
ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నచోట అన్ని తరగతుల పిల్లలనూ ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. పిల్లల అభ్యసన సరిగా లేకపోయినా పై తరగతులకు పంపేస్తున్నారు. విద్యార్థులకు ఎంతవరకు పాఠాలు అర్థమయ్యాయి, ఎంతవరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవట్లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఏకోపాధ్యాయ బడుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోధించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, ఆన్లైన్ హాజరు వివరాల నమోదు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలు అప్లోడ్ చేసేందుకు కొంత సమయం పోతోందని వెల్లడిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండు చేస్తున్నారు.
0 Comments:
Post a Comment