✍️నాడు-నేడుకు నిధుల్లేవ్
♦️రెండో విడతలో దాదాపు రూ.1000 కోట్ల బిల్లుల బకాయి
♦️వందల పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు
♦️అవస్థలు పడుతున్న విద్యార్థులు
🌻ఈనాడు - అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న ‘నాడు-నేడు’ పథకమూ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. రెండోదశ పనులకు సంబంధించి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సిమెంటు కంపెనీలకూ రూ.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఫలితంగా సగం పూర్తయిన పనులతో వందల కొద్ది పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పనులు పూర్తయిన కొన్నిచోట్ల నాసి బయటపడుతుండటం గమనార్హం. గదులు పూర్తికానందున పాఠశాలల్లో తరగతుల విలీనాన్ని విద్యాశాఖ కొన్నిచోట్ల వాయిదా వేసుకుంది.
♦️ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ రెండో దశ పనులకు 2021 ఆగస్టు 16న సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మొత్తం 22,344 పాఠశాలలు, వసతిగృహాలు, జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టారు. వీటికి అదనంగా నాబార్డు నుంచి రూ.2,538 కోట్లు తీసుకొచ్చి 3199 పాఠశాలల్లో పనులు చేస్తామన్నారు. మొత్తం పనులను గతేడాది జులై నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. పరిపాలన అనుమతులు ఇచ్చేందుకే దాదాపు ఏడాది సమయం పట్టింది. తర్వాత గడువును పెంచి... ఈ నెల చివరి నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితం మాత్రం కనిపించడంలేదు. పాఠశాలల వద్ద కూడా నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల స్వల్పంగా సిమెంటు, ఇసుక నిల్వలు ఉన్నా పనులు జరగడం లేదు. వైయస్ఆర్ జిల్లాలోని ఓ పాఠశాలలో గత అక్టోబరు నుంచి నిధులు లేక పనులు నిలిచిపోయాయి. ఇక్కడ మిగిలి ఉన్న సిమెంట్ పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది.
♦️డంపింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన ఇసుక, ఇతర మెటీరియల్ను పాఠశాలల ఆవరణ, తరగతి గదుల్లో నిల్వ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రూ.266 కోట్లు వెనక్కి
నిధుల విడుదలలో తీవ్ర జాప్యంతో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఖర్చు చేయని మొత్తాలను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.266.24 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అత్యధికంగా కాకినాడ, గుంటూరు జిల్లాల నుంచి రూ.28 కోట్లు తీసుకున్నారు.
♦️బయటపడుతున్న డొల్లతనం
ఇప్పటికే జరిగిన పనుల్లోనూ నాణ్యతలేమి బయటపడుతోంది. ముఖ్యంగా పాత శ్లాబులకు చేసిన ప్లాస్టరింగ్ పెచ్చులుగా ఊడి పడుతోంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఈనెల 7న భవనం శ్లాబు పెచ్చులు ఊడటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. 2022 సెప్టెంబరు 7న తిరుపతి బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో తరగతి గది పైకప్పు పెచ్చులూడి ఒకరికి బలంగా... మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
♦️వెలిసిపోతున్న రంగులు
మొదటి విడతలో 15,713 పాఠశాలలకు రంగులు వేశారు. వీటిల్లో 15% బడుల్లో రంగులు పోయాయి. మరికొన్ని చోట్ల గోడలపై మచ్చలు పడుతున్నాయి. పాత రంగులను పూర్తిగా తొలగించకపోవడం, వేసినవీ నాణ్యంగా లేకపోవడంతో ఇలా జరిగినట్లు తనిఖీల్లో వెల్లడైంది. పెయింటింగ్కు గ్యారంటీ ఉండటంతో ఆయా కంపెనీలతో ఈనెలలోపు మళ్లీ రంగులు వేయించాలని నిర్ణయించారు.
0 Comments:
Post a Comment