✍️సర్వీసు సర్టిఫికెట్లను డీఈవోలు ధ్రువీకరించాల్సిందే
♦️ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టీకరణ
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులకు జత చేసిన సర్వీసు సంబంధ ధ్రువపత్రాలపై జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో) సంతకాలున్నాయో లేదో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను హైకోర్టు ఆదేశించింది. డీఈవో సంతకాలు లేని వాటిని తిరస్కరించాలని తేల్చిచెప్పింది. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ రోజు (మార్చి 1)న వివరాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, న్యాయవాది చలసాని వెంకట్ వాదనలు వినిపిస్తూ.. అర్హతలను పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేర్చారన్నారు. సర్వీసు సర్టిఫికెట్లను డీఈవోలు ధ్రువీకరించకపోయినా ఓటరుగా పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. పిటిషనర్లు అభ్యంతరం తెలపడంతో ఇప్పటికే 788 ఓట్లు తొలగించారని కోర్టుకు చెప్పారు. ఓటు దరఖాస్తులన్నింటినీ తమకు ఇస్తే అనర్హుల వివరాలను బయటపెడతామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. సర్వీసు సర్టిఫికెట్లను బహిర్గతం చేయడం గోప్యత హక్కును హరించడమేన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని చెప్పారు.
0 Comments:
Post a Comment