Mahamrityunjaya Mantra Maha Shivaratri 2023 Special:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని పూజిస్తున్నాం. పండిన దోసకాయ తొడిమ నుంచి వేరుపడినట్టే మమ్మల్ని కూడా మృత్యువు నుంచి విడిపించు అని అర్థం.
మృత్యువును (చావును) జయించడమంటే శరీరం పతనం కాకుండా వేల సంవత్సరాలు జీవించడం కాదు. పునర్జన్మ లేకపోవడం. అంటే మళ్లీ మళ్లీ జనన మరణాలు లేకపోవడం, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలోనే ముక్తి పొందడం.
ముక్తి అంటే మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, బతికి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తి స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ మంత్రం. మృత్యుంజయ మంత్రం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
ఉర్వారుక అంటే దోసపండు. సాధారణంగా దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఈ దోసపండులా అలవోకగా ప్రాపంచికత నుంచి విడవడతాడు.
అంటే తనను ఆవహించిన మాయనుంచి బయటపడతాడన్నమాట. పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలైన ఈ సంసారం అనే మాయనుంచి విడిపోయినా దేహ ప్రారబ్ధం తీరేంతవరకు జీవుడు అక్కడే ఉంటాడు. ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడని అర్థం.
మృత్యుంజయ మంత్రం ఎప్పుడు ఎలా జపించాలి
మృత్యుంజయ మంత్రాన్ని రోజుకి 108 సార్లు ఉచ్ఛారణ చేయవచ్చు. 12 ని 9 తో గుణిస్తే 108 వస్తుంది. అంటే ఇక్కడ 12 రాశిచక్రాలను, 9 గ్రహాలకు సూచనగా 108 కి అంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట.
మానవులు అన్ని గ్రహాలు, రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు సరిసమానంగా చేసి ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలని చెబుతారు పండితులు.
మృత్యుంజయ మంత్రాన్ని ఫలానా సమయంలోనే జపించాలనే నియమం ఏమీ లేదు.. పగలు, రాత్రి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు
చదువుకునే ముందు దీనిని జపిస్తే ఏకాగ్రత పెరుగుతుంది..నిద్రపోయే ముందు జపిస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుంది
మహా మృత్యుంజయ మంత్రం జపించటం వల్ల కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది
క్షీర సాగన మథనంలో వచ్చిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారని విశ్వాసం
ఈ మంత్రాన్ని మృత సంజీవని అని కూడా అంటారు. అందుకే భయం వేసినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఈ మంత్రం చదువుకుంటే ఉపశమనం లభిస్తుందని చెబుతారు
0 Comments:
Post a Comment