✍️జీతం! నాడు ఠంచన్గా..నేడు టెన్షన్గా..
♦️అప్పట్లో ఒకరోజు ముందే..
♦️1977 నుంచి అమల్లో జీవో
తర్వాత లెక్కల సమర్పణ ఇబ్బందులతో ఒకటిన జీతాలు
♦️జగన్ ప్రభుత్వంలో నిర్దిష్టంగా ఒక రోజంటూ లేదు
♦️రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అగచాట్లే
🌻ఈనాడు, అమరావతి: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక... ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించడమూ కష్టమైపోతోంది. అదో చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకటో తేదీ అంటే జీతాల రోజు. ఎప్పటినుంచో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం అది. ఉద్యోగులంతా దానికోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది జగన్ వచ్చాక.. అసలు జీతాలు, పింఛన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోయింది. ఒకటో తేదీ జీతాల పండగ మాట దేవుడెరుగు.. సంక్రాంతి నెలలోనూ సకాలంలో జీతాలు అందుకోలేని దుస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ‘సకాలంలో జీతాలు ఇప్పించండి మహాప్రభో... ఈ విషయంలో చట్టం చేయించండి’ అంటూ గవర్నరుకు ఉద్యోగ సంఘాలు గోడు వెళ్లబోసుకునే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ చేరిపోయింది. ఒకటి, రెండు నెలలు కాదు- నెలల తరబడి సకాలంలో జీతాలందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఇన్నీ, అన్నీ కావు. పింఛను వస్తే తప్ప రోజు గడవని విశ్రాంత ఉద్యోగులు ఎందరో. అలాంటివారికీ దీనావస్థ తప్పడం లేదు. పింఛన్ల కోసం మూడో వారం, నాలుగో వారం వరకూ ఎదురుచూడాల్సిన ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. నెలాఖరున లేదా మరుసటి నెల ఒకటో తేదీన జీతం చెల్లించేలా ప్రభుత్వ మార్గదర్శకాలున్నాయని.. ఆ మేరకు చట్టం చేయాలని ఉద్యోగులు గవర్నరుకు విన్నవించారు.
♦️ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లోకి వెళ్తే ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం ఇవ్వడం కాదు... పనిచేసిన నెలకు ఆ నెల చివరిరోజే జీతాలు చెల్లించేవారట. ఇందుకు జీవోలే ఉన్నాయి. ఎప్పుడో 1977 నుంచే ఈ జీవో అమలవుతోంది. ప్రతినెలా చివరి రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా ద్వారా జీతాలు, పింఛన్లు చెల్లించేవారు. ఇలా నెలాఖరు రోజున చెల్లించాలని 1977లో జీవో నంబరు 176, తర్వాత 1979లో కొన్ని సవరణలతో జీవో నంబరు 159లను అప్పటి ప్రభుత్వాలు వెలువరించాయి. ఆ ప్రకారం ఠంచనుగా నెలాఖరు రోజున ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలిచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూం 1, ఆర్టికల్ 72 ప్రకారం ఈ ఉత్తర్వులు అమల్లో ఉండేవి. ఆ తర్వాత కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నెలాఖరు కాదు.. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు వెలువరించింది. జీతాలు, భత్యాలు, సెలవు వేతనం, నెలలో ఇతరత్రా రెగ్యులర్గా చేపట్టే చెల్లింపులు రాష్ట్రంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులకు, వర్కుఛార్జుడ్ సిబ్బందికి వేతనాలు, ప్రతినెలా ఆ నెల ఆఖరు రోజున చెల్లించాలని 1979నాటి జీవో 159 పేర్కొంటోంది. ఒక్క మార్చి జీతం మాత్రం ఏప్రిల్ ఒకటిన చెల్లించవచ్చని ఆ జీవో నిర్దేశిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం చట్టంగానే పరిగణించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలనే చట్టం, జీవోలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటి నెల మూడోవారం వరకూ జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరని, లేకుంటే సకాలంలో జీతాలు చెల్లించేలా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించి ఉండేవారనీ వ్యాఖ్యానిస్తున్నారు.
♦️ఒకటో తేదీ జీతానికి ఎలా మారింది?
జీతాల విషయంలో 1990 నుంచి చిన్న మార్పు చేశారు. ఆ నెల జీతం మరుసటి నెల ఒకటో తేదీన చెల్లించాలని నిర్ణయం తీసుకుని 1990 ఏప్రిల్ 17న కొత్త జీవో 223ను వెలువరించారు. ఇలా ఎందుకు మార్చారంటే.. 1988లో జిల్లా ఖజానా అధికారుల సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో హైదరాబాద్ ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్కు ప్రతినెలా ఎకౌంట్ల సమర్పణపై చర్చ జరిగింది. జిల్లాల ఖజానా అధికారులు గడిచిన నెల ఎకౌంట్లు ఆ మరుసటి నెల 12 నుంచి 17 తేదీల మధ్య ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్కు సమర్పిస్తున్నారన్న చర్చ జరిగింది. ప్రతినెలా ఆఖరి రోజున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నందున ఆ రోజున లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని జిల్లాల ఖజానా అధికారులు తెలిపారు. ఆ లావాదేవీలన్నీ సరిచూసుకుని ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్కు ఎకౌంట్లు సమర్పించేందుకు దాదాపు 12 నుంచి 17 రోజుల సమయం తీసుకుంటోందన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపును ఒకరోజు వాయిదా వేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇలా ప్రతినెలా ఒకటిన జీతాలిస్తే ఈ లెక్కలన్నీ క్రోడీకరించి సరిచూసుకుని ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్కు సమర్పించేందుకు 40 రోజుల సమయం ఉంటుందని వారు వివరించారు. అందుకే జీతాలు చెల్లించే తేదీని మరుసటి నెల ఒకటో తేదీకి మార్చాలని ఈ సదస్సు ప్రభుత్వానికి సూచించింది. ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ కూడా 1989 జూన్ 21న ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రతి నెలా మొత్తం జిల్లాల ఖజానా అధికారుల నుంచి సమగ్ర లెక్కలు తమకు మరుసటి నెల పదోతేదీ లోపు చేర్చలేకపోతే తాము కేంద్రానికి 20వ తేదీలోపు సమగ్ర లెక్కలు సమర్పించలేమని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నెలాఖరున జీతాలు చెల్లించే పక్షంలో ఖజానా సిబ్బంది ఆ మరుసటి నెల 10లోపు లెక్కలు సమర్పించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పారు. అప్పటి నుంచి గడిచిన నెల జీతాలు, వేతనాలు ఒకటో తేదీన చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు సవరించింది.
♦️నాడు లెక్క తప్పేది కాదు... నేడో...
అప్పట్లో ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్కు సకాలంలో లెక్కలు సమర్పించేందుకు, కేంద్రానికి సకాలంలో చేర్చేందుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. జీతాలు కూడా సకాలంలో అందేవి. ప్రస్తుతం అప్పు పుడితేనే జీతం. ఒకటో తేదీనాటికి ఖజానా వెలవెలబోతోంది. రిజర్వుబ్యాంకు కల్పించిన ఓవర్డ్రాఫ్ట్, ఇతర వెసులుబాట్లు వినియోగించుకున్నా జీతాలు, పింఛన్లకు సొమ్ములు సరిపోవట్లేదు. బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్రం నుంచి అనుమతులు ఉంటే అవి సకాలంలో అందితే జీతాలు చెల్లించగలరు. లేనిపక్షంలో ప్రభుత్వానికి అప్పు పుట్టేవరకూ జీతాల కోసం ఉద్యోగులు వేచిచూడక తప్పట్లేదు. అది రెండోవారం కావచ్చు.. నాలుగోవరం వరకూ అయినా పట్టొచ్చు!
0 Comments:
Post a Comment