Hindu Families Houses in Pakistan: పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. రావల్పిండిలో 70 ఏళ్లుగా ఒకే చోట నివాసం ఉంటున్న హిందూ, క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేసిన అధికారులు..
ఆ కుటుంబాలను వీధిపాలు చేశారు. రావల్పిండి కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
కంటోన్మెంట్ బోర్డు అధికారుల ఆగడాలకు మొత్తం ఐదు కుటుంబాలు నిరాశ్రయిలై రోడ్డునపడగా.. వారిలో ఒక షియా ముస్లిం తెగకు చెందిన కుటుంబం కూడా ఉంది.
కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల అరాచకం కారణంగా ఇల్లు పోగొట్టుకుని రోడ్డున పడిన హిందూ కుటుంబం ప్రస్తుతం రావల్పిండిలోని ఓ మందిరంలో తల దాచుకోగా.. క్రిష్టియన్, షియా కుటుంబాలకు ఆ అవకాశం కూడా లేకుండాపోయింది.
వారు సర్వం కోల్పోయి వీధిలోపడ్డారు. తమకు జరిగిన అన్యాయం గురించి హిందూ కుటుంబం స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు అంతా ఓ మాఫియాలా తయారయ్యారని 100 మందితో వచ్చి తమపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని వాపోయారు.
తాము ఈ స్థలంలో 70 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని.. తమకు చట్టరీత్యా ఉండాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అన్నారు.
కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తమ ఇంట్లోని వస్తుసామాగ్రిని వీధిలోకి విసిరేసి తమ ఇల్లు కూల్చేశారని వాపోయారు.
కంటోన్మెంట్ బోర్డు కూడా అరాచక శక్తులకే అండగా ఉండటం వల్ల తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు.
పాకిస్థాన్లో గత కొన్ని దశాబ్ధాలుగా మైనారిటీల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని.. అడుగడుగునా అరాచకశక్తులు పెట్రేగిపోతున్నప్పటికీ... పోలీసులు, కోర్టులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారని బాధిత కుటుంబాలు తెలిపాయి.
0 Comments:
Post a Comment