Ganga Vilas: ప్రపంచంలోనే అత్యంత దూరం నదీ విహారం చేసే నౌకగా ఎంవీ గంగా విలాస్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. రేపు తన మొదటి ప్రయాణాన్ని ఈ నౌక ప్రారంభించనుంది.
ప్రధాని నరేంద్ర మోడీ జండా ఊపి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నుంచి మొదలుపెట్టి అస్సాంలోని దిబ్రూగర్ వరకు మొత్తం 3,200 కిలోమీటర్లు చుట్టి రానుంది. 51 రోజుల ఈ యాత్రలో భారత్, బంగ్లాదేశ్లోని 27 నదుల్లో విహరించనుంది.
ప్రపంచానికి పరిచయమే లక్ష్యంగా..
మూడు అంతస్థులు, 18 గదులతో కూడిన ఈ క్రూయిజ్ షిప్లో.. అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చారు. 36 మంది పర్యాటకులు ఇందులో విహరించవచ్చు. స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది ఇందులో మొదటగా ప్రయాణించనున్నారు. దేశంలో నదీ పర్యాటకాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీసును ప్రారంభించారు.
ఆధ్యాత్మిక, సాంస్క్రృతిక యాత్ర:
మొత్తం 51 రోజులు కొనసాగనున్న ఈ యాత్ర.. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు సహా ప్రముఖ నదీ తీర నగరాలు పాట్నా, సాహిబ్గంజ్, కలకత్తా, గౌహతి, బంగ్లాదేశ్లోని ఢాకాలను చుట్టి రానుంది.
తద్వారా భారత్, బంగ్లాదేశ్ల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చారిత్రక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించే అవకాశం కలుగనుంది. ఈ విలాసవంతమైన నౌకలో ప్రతి అంతస్థునూ విభిన్న రీతిలో అలంకరించారు. కన్వర్టబుల్ బెడ్లు, ఫ్రెంచ్ బాల్కనీ, స్మోక్ అలారం, స్ప్రింక్లర్స్ మొదలగు అన్ని హంగులనూ ఇందులో సమకూర్చారు.
ఎందుకంత ప్రత్యేకం:
నదీ యానాన్ని కేవలం యాత్రగా మాత్రమే కాక పర్యాటక, వ్యాపార కోణంలోనూ చూడాల్సి ఉంటుంది. చమురు ధరల్లో భారీ వ్యత్యాసాలు, రవాణా ఛార్జీల పెరుగుదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలరవాణాయే ఉత్తమ మార్గం. దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. దేశీయ జల రవాణా బిల్లును 2021లో ఆమోదించింది.
దేశంలోని వివిధ నదుల అనుసంధానం ద్వారా నదీ పర్యాటకంతో పాటు వస్తు రవాణా సైతం చౌకగా, సురక్షితంగా జరిగే అవకాశం ఉంది. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది.
అమెరికా వంటి దేశాలు 20 శాతానికి పైగా సరుకు రవాణాను ఈ పద్ధతిలో నిర్వహిస్తుండగా.. భారత్ మాత్రం అందుకు భిన్నంగా 5 శాతం కూడా వినియోగించుకోవడం లేదు.
0 Comments:
Post a Comment