School Education: హెచ్ఎం పోస్టుల్లో కోత!93 మంది విద్యార్థులు లేకపోతే కట్
హైస్కూల్-ఏలో 138 మంది ఉంటేనే
దీంతో హెచ్ఎంలు లేకుండానే నడవనున్న ఉన్నత పాఠశాలలు
వారితో పాటు పీడీ పోస్టుల్లోనూ కోత
ఉపాధ్యాయులపై పెరగనున్న భారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రధానోపాధ్యాయుల(హెచ్ఎం) పోస్టుల్లో భారీ కోత పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ (School Education Department) సిద్ధమైంది. జూన్లో రేషనలైజేషన్ కోసం జారీచేసిన జీవో 117ను ప్రస్తుత బదిలీ ప్రక్రియలో అమలుచేస్తోంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో(హైస్కూళ్లు) హెచ్ఎం పోస్టులు కనుమరుగవనున్నాయి. జీవో 117 ప్రకారం హైస్కూళ్లను రెండుగా వర్గీకరించారు. 3-10 తరగతులున్న పాఠశాలలను హైస్కూల్-ఏగా, 6-10 తరగతులున్న పాఠశాలలను హైస్కూల్-బీగా విభజించారు. హైస్కూల్-ఏలో 138 మంది విద్యార్థులుంటేనే హెచ్ఎం సహా ఫిజికల్ డైరెక్టర్(పీడీ) పోస్టులు ఉంటాయి. అలాగే హైస్కూల్-బీలో 93 మంది విద్యార్థులుంటనే హెచ్ఎం, పీడీ పోస్టులు కొనసాగుతాయి. ఇప్పటి వరకు హైస్కూళ్లలో విద్యార్థులతో సంబంధం లేకుండా ప్రధానోపాధ్యాయులు కొనసాగుతున్నారు. కానీ, రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం హెచ్ఎం పోస్టులు తగ్గించుకునే ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ కోతలకు దిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను పైన పేర్కొన్న స్థాయిలో విద్యార్థులు లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ పాఠశాలలన్నీ హెచ్ఎం, పీడీల్లేకుండా కేవలం టీచర్లతో కొనసాగాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం సొంత జిల్లా కడపలోనే 41 పాఠశాలలకు హెచ్ఎంలు లేని పరిస్థితి ఏర్పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 పాఠశాలలు ఈ జాబితాలోకి వచ్చే అవకాశం ఉంది.
బాలికా విద్యపై ప్రభావం!
బాలికల అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఎల్ఎఫ్ఎల్(లో ఫిమేల్ లిటరసీ) పోస్టుల్లోనూ కోత పెడుతున్నారు. 117 జీవో ప్రకారం 121 మంది విద్యార్థులుంటేనే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇది అన్యాయమని, ఎప్పటినుంచో ఉన్న పోస్టులను సంఖ్యతో ఎలా ముడిపెడతారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, జీవోలో ఇతరత్రా కొన్ని మార్పులతో సవరణలు జారీ అయ్యాయి. విచిత్రం ఏంటంటే 121ని కాస్తా సవరణలో 150కి పెంచారు. అంటే 150 మంది విద్యార్థులు లేకపోతే ఎల్ఎ్ఫఎల్ హెచ్ఎం పోస్టు ఉండదని స్పష్టం చేశారు. సంఖ్య తగ్గించాలని తాము కోరితే, పెంచడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పలు కేటగిరీల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం పక్కన పెట్టనుంది. ఒకసారి హెచ్ఎం పోస్టు కోల్పోతే శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉంది. కాగా, ఈ ప్రక్రియలో హెచ్ఎం పోస్టులు కోల్పోయే పాఠశాలల వల్ల హెచ్ఎంలు కూడా ఖాళీగా
మిగిలిపోతారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది కొత్త ప్రశ్న. అలాగే పాఠశాలల్లో వ్యాయామ విద్య తప్పనిసరిగా ఉండాలని జాతీయ విద్యా విధానం చెబుతుంటే దానికి వ్యతిరేకంగా పీడీ పోస్టులను ప్రభుత్వం పక్కన పెడుతోంది.
టీచర్లపై పెరగనున్న ఒత్తిడి
స్కూల్ అసిస్టెంట్లపై పనిభారం పెరగనుంది. ఇప్పటి వరకు సగటున ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 32 పీరియడ్లు పనిచేస్తుంటే ఇకపై 36 పీరియడ్లకు తగ్గకుండా బోధించాలి. అంటే ఆరు పనిదినాలకు రోజుకు ఆరు పీరియడ్లు చొప్పున పాఠాలు చెప్పాలి. పాఠశాలలో ఎనిమిది పీరియడ్లు ఉంటాయి. వాటిలో ఆరు పీరియడ్లు బోధించడం అంటే దాదాపుగా రోజంతా పాఠాలు చెప్పే పనిలోనే ఉండాలి. అలాగే వాటితో పాటు హాజరు, పాఠ్య ప్రణాళికలు, ఇతరత్రా యాప్ల భారం ఉపాధ్యాయులపై ఉంటుంది.దీంతోపాటు ఉన్నత పాఠశాలల్లో తరచూ ఎవరో ఒకరు సెలవులో ఉంటారు. అప్పుడు ఆ తరగతులను మిగిలిన వారు సర్దుబాటు చేసుకోవాలి. అలాగే, తాజా విధానంలో సబ్జెక్టు టీచర్లకు 5 సెక్షన్లు ఉన్న పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఒక్క టీచరే ఉంటారు. ఉదాహరణకు 6-10 తరగతులున్న ఉన్నత పాఠశాలలో గణితం టీచర్ ఐదు తరగతులకు బోధించాలి. ఒకవేళ ఆ టీచర్ సెలవు పెడితే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో ఉండరు. అదే ఆరు సెక్షన్లుంటే గణితానికి అదనంగా టీచర్ను ఇస్తారు. ఏడు సెక్షన్లు ఉంటే ఆంగ్లానికి మరో టీచర్ను ఇస్తారు. హైస్కూల్-ఏలో మాత్రం పది సెక్షన్లు ఉన్నా ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్కు ఒక్కొక్క టీచరే ఉంటారు. వీరు 7 తరగతులకు బోధించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment