Post Office Best Schemes: పోస్ట్ ఆఫీస్ 5 అత్యుత్తమ పథకాలు.. వీటిలో పెట్టుబడి పెడితే డబుల్ ఆదాయం..
సురక్షితమై, నమ్మకమైన పెట్టుబడులకు గమ్యస్థానం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్టాఫీసు పథకాలే అని బల్లగుద్ది చెప్పొచ్చు. దేశంలోని పౌరుల కోసం పోస్టాఫీసు అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది.
వీటిల్లో పెట్టుబడలు పెట్టడం ద్వారా ప్రజలు కూడా మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సంపాదనను పోస్టాఫీస్ స్కీమ్లలో పెట్టుబడి పెడుతుంటారు. పోస్ట్ ఆఫీస్ పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక ప్లాన్స్ అమలు చేస్తోంది. మీరు కూడా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇందులో 5 అత్యుత్తమైన స్కీమ్ ఉన్నాయి. వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందడంతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
1. సుకన్య సమృద్ధి యోజన..
ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ను అమలు చేస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద, 0 నుండి 10 సంవత్సరాల వరకు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడికి ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఈ పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 నుండి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిపై 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
2. కిసాన్ వికాస్ పత్ర..
మీరు మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే.. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడిపై 6.9 శాతం వడ్డీ లభించేది. కానీ ప్రభుత్వం ఇప్పుడు దానిని 7.0 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఈ పథకంలో పెట్టుబడి మొత్తం 124 నెలల్లో రెట్టింపు అయ్యేది. కానీ ఇప్పుడు ఈ మొత్తం 123 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. రూ. 1000 పెట్టుబడితో ఎవరైనా ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి అటూ ఏమీ లేదు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
3. రికరింగ్ డిపాజిట్..
పోస్టాఫీసు స్మాల్ సేవింగ్ స్కీమ్ 'రికరింగ్ డిపాజిట్'. ఇది అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 5.80 శాతం వడ్డీ లభిస్తోంది. మీ సౌలభ్యం ప్రకారం ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పొదుపు పథకంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. కనిష్టంగా రూ.100తో ఈ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన పథకం అని చెప్పొచ్చు. ఈ పోస్టాఫీసు పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు. దీనిని ఐదేళ్లపాటు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా.. ఆదాయపు పన్నుపై 80C కింద మినహాయింపు కూడా లభిస్తుంది.
5. నెలవారీ ఆదాయ పథకం(Monthly Income Scheme)..
నెలవారీ ఆదాయ పథకం అనేది ఒక రకమైన పెన్షన్ పథకం. ఇందులో ఏకమొత్తం డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు.ఈ పోస్టాఫీసు పథకం ఐదేళ్లపాటు ఉంటుంది. అయితే, మీకు కావాలంటే దానిని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు. పథకం మెచ్యూరిటీ తర్వాత, మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రస్తుతం నెలవారీ ఆదాయ పథకంలో 6.7 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
0 Comments:
Post a Comment