One Rank One Pension: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ని సవరించిన కేంద్రం.. 25 లక్షల మందికి లబ్ధి.
Centre revises One Rank One Pension scheme: పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) స్కీమ్ ను కేంద్ర మంత్రి వర్గం సవరించింది.
దీంతో 25 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది మాజీలకు లబ్ధి చేకూరనుంది. సవరించిన విధానంతో సాయుధ దళాల పెన్షనర్ల పెన్షన్ పెరగనుంది.
జూన్ 30, 2019 వరకు పదవీ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది పెన్షన్ రివిజన్ కిందకు వస్తారు. జూలై 1, 2019 నుండి ఈ సవరింపులు అమలులోకి వస్తాయి. యుద్ధ వితంతువులు, వికలాంగుల పింఛనుదారులతో సహా కుటుంబ పెన్షనర్లకు ఈ ప్రయోజనాన్ని వర్తింపచేశారు. జూలై 2019 నుండి జూన్ 2022 వరకు, రూ. 23,638 కోట్లు బకాయిలు చెల్లించనున్నారు. ఈ సవరింపులతో డీఆర్ 31 శాతంతో దాదాపుగా రూ. 8,450 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర లెక్కించింది.
జూలై 1, 2014 నుండి ఉన్న పెన్షన్ విధానాన్ని సవరించి నవంబర్ 2015 లో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ని అమలు చేయడానికి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఫించన్ రీవర్క్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు ఎనిమిదేళ్లలో ఏడాదికి రూ. 7,123 కోట్ల చొప్పున దాదాపుగా రూ. 57,000 కోట్లు ఖర్చు చేశారు.
0 Comments:
Post a Comment