Mandous : దూసుకొస్తున్న మాండస్ తుఫాను.. రాయలసీమ, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం.
Cyclone Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను.. రోజురోజుకూ పరిధి పెంచుకుంటూ.. మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి.
నిన్న తీరం దాటుతుందని అంచనా వెయ్యగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడుతోపాటూ.. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో.. బలమైన గాలులు వీస్తాయనీ, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని చెబుతున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి వరకూ వర్షాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 10న తీరం దాటాక మాండస్ తుఫాను జోరు తగ్గనుంది. అది బలహీనపడి వాయుగుండంగా మారుతుందని ఆ తర్వాత మరింత బలహీనపడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి తమిళనాడులో వర్షాలు మొదలవుతాయనీ.. శుక్రవారానికి అవి భారీ వర్షాలుగా మారతాయని అంటున్నారు వాతావరణ అధికారులు. శనివారం మధ్యాహ్నం వరకూ వర్ష తీవ్రత ఉంటుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
నిజానికి ఈ సంవత్సరం తమిళనాడులో అంతగా వర్షాలు లేవు. నీటి కొరత బాగా ఉంది. ఈ తుఫాను వల్ల పడే వర్షాల వల్ల నీటి కొరత కొంత తీరుతుందనే అంచనాలో ఉన్నారు అధికారులు. తమిళనాడుతోపాటూ.. పుదుచ్చేరి పైనా తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
ఏపీకి మాత్రం ఈ తుఫాను వల్ల నష్టం జరుగుతుందనే అంచనా ఉంది. ఏపీలో ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. అందువల్ల ఈ తుఫాను రావడం వల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఏదీ లేదంటున్నారు. ఐతే.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటూ.. జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని కోరుతున్నారు.
0 Comments:
Post a Comment