Cordyceps: భారత్, చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. గత వారంరోజుల క్రితం ఈ ప్రాంతంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.
ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైన్యాధికారులు ఇప్పటికే 21 దఫాలుగా చర్చలు జరిపారు. అయినా చైనా సైన్యం తన పరిధిదాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
వారి కుయుక్తులను భారత బలగాలు తిప్పికొడుతూనే ఉన్నాయి. అయితే, భారత భాగంలోని ఆ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించేందుకు చైనా ఎందుకు అంతలా ఆరాటపడుతుందన్న విషయాన్ని పరిశీలిస్తే.. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో హిమాలయ గోల్డ్ గా పిలుచుకునే కార్డిసెప్స్ ఫంగస్ కోసమేనని ఇండో – పసిఫిక్ ఫర్ స్ట్రాలెజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్సీ) ఓ నివేదికలో వెల్లడించింది.
కార్డిసెప్స్ ఫంగస్ ఎక్కువగా భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై – టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంటుంది.
ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు క్షీణించడంతో ఆ ప్రాంతంలో కొరత ఏర్పడింది. చైనాలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని వెతుక్కుంటూనే చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐపీసీఎస్సీ నివేదిక తెలిపింది. ఈ కార్డిసెప్స్ ఫంగస్ పసుపు, కాషాయ రంగుల్లో ఉంటాయి. అచ్చం పచ్చిమిర్చిని పోలి ఉంటాయి.
హిమాలయ గోల్డ్గా పిలుచుకునే కార్డిసెప్స్ ఫంగస్లో అనేక ఔషధ గుణాలున్నాయి. క్యాన్సర్ కణాలను అడ్డుకొనే శక్తి ఉన్నదని చైనీయులు భావిస్తున్నారు. వీటి ధర బంగారం కంటే ఎక్కువ. దేశ, విదేశాల్లో వీటికి భారీ డిమాండ్ ఉంది.
2022లో దీని మార్కెట్ విలువ రూ. 8,900 కోట్లు. కార్డిసెప్స్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు (రూ. 56వేలు) ఉంటుందని తెలుస్తోంది. మేలురకమైన కార్డిసెప్స్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment