కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఆయన కేవలం టీ షర్టే ధరిస్తున్నారు. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైంది.
విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం యాత్ర కొనసాగుతున్న ఢిల్లీ అయితే చలికి విపరీతంగా వణికిపోతోంది. అయినా కూడా ఆయన చలిని తట్టుకునే ఎలాంటి దుస్తులు ధరించడం లేదు.
ఎప్పటిలాగే తెల్లటి టీషర్ట్ మాత్రమే కనిపిస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని అందరికీ సందేహం కలుగుతోంది.
దీనిపై రాహుల్ గాంధీ నేడు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు కొంత విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. దీంతో ఆయన సోమవారం వీర్ భూమికి చేరుకున్నారు.
మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయిల స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు.
ఉత్తర భారతం అంతటా శీతల గాలులు వీస్తున్న ఈ సమయంలో కూడా ఆయన టీ-షర్టు, ప్యాంటు ధరించి చెప్పులు లేకుండా నడిచారు.
ఈ సమయంలో అక్కడికి మీడియా చేరుకుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇతర దుస్తులు లేకుండా, కేవలం టీ షర్ట్ పైనే ఉంటూ చలిని ఎలా తట్టుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. '' నాకు చలిగా అనిపించడం లేదా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఎవరూ ఓ రైతును, ఓ కార్మికుడిని, పేద పిల్లలను ఈ ప్రశ్న అడగరు '' అని ఆయన బదులిచ్చారు.
'' నేను 2,800 కిలో మీటర్లు నడిచాను. కానీ అది పెద్ద విషయం కాదని నేను నమ్ముతున్నాను. రైతులు ప్రతిరోజూ చాలా నడుస్తారు. వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, నిజం చెప్పాలంటే భారతదేశం మొత్తం ఇలా నడుస్తూనే ఉంటారు'' అని ఎర్రకోట సమీపంలో శనివారం జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.
యాత్ర ఢిల్లీకి చేరుకుందని, తాను కన్యాకుమారి నుంచి అన్ని మార్గాల్లో ప్రయాణించానని అన్నారు. అయితే సామాన్య ప్రజలలో ఎలాంటి ద్వేషం కనిపించలేదని తెలిపారు. కానీ నేను వారిలో భయాన్ని చూశానని చెప్పారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. " నేను యాత్ర ప్రారంభించినప్పుడు అన్ని చోట్లా ద్వేషం ఉంటుందని అనుకున్నాను.
కానీ నాకు అది కనిపించలేదు. మీరు టీవీల్లో చూస్తే కేవలం హిందూ-ముస్లిం, హిందూ- ముస్లిం అంటూ కనిపిస్తుంది. కానీ భారతదేశ ప్రజలు అలా లేరు.'' అని ఆయన అన్నారు.
0 Comments:
Post a Comment