భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి రాజుకున్నట్లు కనిపిస్తోంది.
2022 డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో రెండు దేశాల సైన్యాలు ఘర్షణకు దిగాయి.
రెండు వైపులా సైనికులూ గాయపడ్డారని, చైనా వైపు గాయపడిన వారు ఎక్కువగా ఉన్నారని భారత సైన్యం చెబుతోంది.
1975 తర్వాత రెండు దేశాల మధ్య 2020లో తూర్పు లద్దాఖ్లో గల్వాన్ లోయలో విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు.
ఆ తర్వాత తూర్పు లద్దాఖ్లోని ప్యాగ్యాంగ్ సో సరస్సు పరిసరాల్లో చైనా గస్తీని పెంచింది. ఈ ప్రాంతం లద్దాఖ్లో వాస్తవాధీన రేఖకు సమీపంలోనే ఉంటుంది.
ఇక్కడ ఘర్షణలకు ముందు కూడా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి రెండు దేశాలూ తమ మోహరింపులు పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి.
గల్వాన్ లోయలో చైనా సైన్యం కొన్ని తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత సైన్యం కూడా ఈ ప్రాంతంలో తమ శిబిరాల సంఖ్యను పెంచింది.
అయితే, గల్వాన్ లోయలో భారత్ అక్రమ కట్టడాలను నిర్మిస్తోందని చైనా ఎప్పటికప్పుడే ఆరోపిస్తోంది. ఇంతకీ రెండు దేశాల మధ్య ఇలాంటి వివాదాస్పద ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి?
VEER KAUR/INDIAPICTURES/UNIVERSAL IMAGES/GETTY
సరిహద్దు వివాదాలు..
చైనాకు భారత్కు 3,488 కి.మీ. మేర పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూకశ్మీర్తో మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దు కొనసాగుతుంది.
ఈ సరిహద్దును మూడు భాగాలుగా విభజించొచ్చు. వీటిలో మొదటిది పశ్చిమ సెక్టార్.. దీనిలో జమ్మూకశ్మీర్ ఉంటుంది. ఆ తర్వాత మధ్య సెక్టార్.. దీనిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంటాయి. మూడోది తూర్పు సెక్టార్.. దీనిలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉంటాయి.
అయితే, రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. ఈ అస్పష్టతే చాలా ప్రాంతాల్లో వివాదాలకు కారణం అవుతోంది.
అక్సాయ్ చిన్ను తమ పశ్చిమ సెక్టార్లోని ప్రాంతంగా భారత్ చెబుతోంది. కానీ, ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. 1962 యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా తమ నియంత్రణలోకి తీసుకుంది.
ఇక తూర్పు సెక్టార్ విషయానికి వస్తే, అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తమ భూభాగంగా చైనా చెబుతోంది. ఇది దక్షిణ టిబెట్లో భాగమని వివరిస్తోంది. మరోవైపు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ల మధ్యనుండే మెక్మోహన్ రేఖను చైనా గుర్తించదు.
1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య ఈ రేఖపై ఒప్పందం కుదిరింది. అయితే, అప్పట్లో తమను ఒప్పందంలో చేర్చుకోలేదని, అందుకే దాన్ని తాము గుర్తించబోమని చైనా చెబుతోంది.
1914లో టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఉండేది. అయితే, 1950లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా చైనా తమ ఆధీనంలోకి తీసుకొంది.
మొత్తంగా మెక్మోహన్ రేఖను చైనా అంగీకరించదు. అదే సమయంలో అక్సాయ్ చిన్ కూడా తమ భూభాగమని చైనా చెబుతోంది.
వాస్తవాధీన రేఖ
ఈ వివాదాల మధ్య రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. దీంతో యాథాతథ స్థితిని కొనసాగించేందుకు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ని తీసుకొచ్చారు. నిజానికి ఎల్ఏసీ కూడా చాలాచోట్ల అస్పష్టంగా ఉంటుంది. రెండు దేశాలు ఈ సరిహద్దును ఒక్కోచోట ఒక్కోలా పేర్కొంటున్నాయి.
చాలాచోట్ల హిమానీనదాలు, మంచు ఎడారులు, పర్వతాలు, నదులు వాస్తవాధీన రేఖపై కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో సరిహద్దులను నిర్ణయించడం మరింత కష్టంగా ఉంటుంది. ఫలితంగా రెండు దేశాల సైన్యాలు ఎదురెదురు పడుతుంటాయి.
ప్యాంగ్యాంగ్ సో వివాదం..
134 కి.మీ. పొడవైన ప్యాంగ్యాంగ్ సో సరస్సు హిమాలయాల్లో 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఈ సరస్సులో 45 కి.మీ. భారత్ నియంత్రణలో ఉంది. మరో 90 కి.మీ. చైనా నియంత్రణలో ఉంటుంది. ఈ సరస్సు మధ్య గుండా వాస్తవాధీన రేఖ వెళ్తుంది.
ప్యాంగ్యాంగ్ సో సరస్సు పశ్చిమ సెక్టార్లో చాలా ప్రాంతాలను చైనా ఆక్రమించిందని భారత సైనిక వర్గాలు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక్కడ వివాదానికి ప్రధాన కారణం వాస్తవాధీన రేఖపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవడమే. ఇక్కడ రెండు దేశాలు సరిహద్దును ఒక్కోలా పేర్కొంటున్నాయి.
అందుకే ఇక్కడ రెండు దేశాల మధ్య విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పొరుగు దేశం సైనికులు తమ భూభాగంలోకి ప్రవేశించారని చెబుతూ రెండు దేశాల సైనిక ప్రతినిధులు మీడియాతో చెప్పారు.
ఈ సరస్సు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చుషుల్ లోయలోని ప్రాంతాలకు దీని గుండా వెళ్లొచ్చు. 1962 యుద్ధంలో ఈ మార్గం గుండానే వచ్చి భారత్పై చైనా దాడి చేసింది. ప్యాంగ్యాంగ్ సో సరస్సుకు తమవైపు చైనా భారీగా రోడ్లు నిర్మిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
గల్వాన్ వివాదం..
ఇక్కడ మరో వివాదాస్పద ప్రాంతం గల్వాన్ లోయ. లద్దాఖ్, అక్సాయ్ చిన్ల మధ్య ఈ ప్రాంతం ఉంటుంది.
భారత్ ప్రధాన భూభాగం, అక్సాయ్ చిన్ మధ్య వాస్తవాధీన రేఖ ఉంటుంది. చైనాలో షిన్జియాంగ్ ప్రాంతం దక్షిణ భాగంలో అక్సాయ్ చిన్ ఉంటుంది.
''ఈ ప్రాంతాలు భారత్కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే లద్దాఖ్, పాకిస్తాన్ నియంత్రణలోని ప్రాంతాలతోపాటు చైనాలోని షిన్జియాంగ్కు ఇవి సమీపంలో ఉంటాయి. 1962 యుద్ధ సమయంలోనూ గల్వాన్ ప్రాంతంలో రెండు దేశాల సైనికులు తలపడ్డారు''అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, ప్రొఫెసర్ ఎస్డీ ముని చెప్పారు.
''గల్వాన్ లోయలో భారత్ నిర్మాణాలను అక్రమం అని చైనా చెబుతోంది. ఎందుకంటే వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని రెండు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి.
కానీ, అటు వైపు ఇప్పటికే చైనా భారీగా సైనిక నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడేమో యాథాతథ స్థితిని కొనసాగించాలని చెబుతోంది. అది ఎలా సాధ్యం?''అని ఆయన ప్రశ్నించారు.
ANI
డోక్లాం ఏమిటి?
2017లో భారత్, చైనాల మధ్య డోక్లాంలో వివాదం రాజుకొంది. ఇది దాదాపు 70 నుంచి 80 రోజులపాటు కొనసాగింది. ఆ తర్వాత చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకించడంతో ఇక్కడ వివాదం మొదలైంది.
నిజానికి ఇది చైనా, భూటాన్ల మధ్య వివాదం. అయితే, ఇది భారత్లోని సిక్కింకు సమీపంలో ఉంటుంది. దీన్ని మూడు దేశాల కూడలిగా చెప్పుకోవచ్చు. అంటే భారత్, చైనా, భూటాన్ల కూడలి ఇది.
అందుకే భారత్కు ఈ ప్రాంతం కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇక్కడ చైనా రోడ్డును నిర్మిస్తే, భారత్లో చికెన్స్ నెక్గా భావించే సన్నని మార్గానికి ముప్పు పొంచివుండే అవకాశముంది.
చికిన్స్ నెక్ అనేది 20 కి.మీ. వెడల్పు ఉండే భారత్ మార్గం. ఇది ఈశాన్య భారత్ను, భారత్ ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది.
మరోవైపు డోక్లాంకు సమీపంలోని ప్రాంతాలు చైనా దాడిని తిప్పికొట్టేందుకు వీలుగా ఉంటాయని విదేశాంగ నిపుణులు కూడా చెబుతుంటారు.
హిమాలయాల్లో ఈ ప్రాంతంపై భారత్ సైన్యం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. దీన్ని వ్యూహాత్మకంగా భారత్ సైన్యం తమకు అనువుగా మార్చుకోలదు. అలాంటి ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తే, భారత్కు ముప్ప పొంచివుండే అవకాశముంది.
తవాంగ్ ఏమిటి?
అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ను చైనా మొదట్నుంచీ ఓ కంట కనిపెడుతోంది. నిజానికి దీన్ని దక్షిణ టిబెట్లో భాగంగా చైనా చెబుతోంది. తవాంగ్, టిబెట్ల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు దాదాపు ఒకేలా ఉంటాయి.
టిబెట్ తరహాలోనే తవాంగ్లోనూ చాలా బౌద్ధారామాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని చైనా ప్రయత్నించింది.
తవాంగ్ బౌద్ధారామాన్ని దలైలామా సందర్శించినప్పుడు చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.
నాథులా..
నాథులా అనేది హిమాలయాల్లోని ఒక పర్వత మార్గం. ఇది సిక్కింను దక్షిణ టిబెట్లోని చుంబీ లోయతో అనుసంధానిస్తుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్కు 54 కి.మీ. తూర్పుగా ఈ పర్వత మార్గం మొదలవుతుంది.
14,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గం భారత్కు చాలా ముఖ్యమైనది. దీని గుండా కైలాస్ మాన్సరోవర్ యాత్రకు వెళ్తుంటారు.
1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో ఈ మార్గాన్ని మూసివేశారు. అయితే, చాలా చర్చల తర్వాత మళ్లీ 2006లో దీన్ని తెరిచారు.
అయితే, 2020 మే నెలలో నాథులా మార్గం దగ్గర కూడా రెండు దేశాల సైనికులు ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి.
వివాదాలు పరిష్కరించేందుకు చర్యలు..
సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాలు బోర్డర్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటుచేసినట్లు భారత్-చైనా వ్యవహారాల నిపుణురాలు గీతా కొచ్చర్ చెప్పారు.
''సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతమున్న వివాదాలు ఘర్షణలుగా మారకుండా రెండు దేశాల సైన్యాలు జాగ్రత్త వహించాలి''అని ఆమె చెప్పారు.
మరోవైపు సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనా ప్రత్యేక రాయబారులను కూడా నియమించినట్లు పీఐబీ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రాయబారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు.
ఈ ప్రత్యేక రాయబారుల 22వ దఫా చర్చలు 2019 డిసెంబరు 21న జరిగాయి. వీటిలో భారత్ తరఫున బృందానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వం వహించారు.
0 Comments:
Post a Comment