అమ్మాయిలు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, చదువు, వివాహం మొదలగు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో 10 ఏళ్లలోపు బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం 2014లో సుకన్య సమృద్ధి యోజన స్కీమును ప్రారంభించింది.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి 7.60% వడ్డీ రేటును ఇస్తోంది. పోస్టాఫీసులో ఏ ఇతర స్కీమ్ కన్నా కూడా దీనిలోనే ఎక్కువ వడ్డీ ఆర్జించవచ్చు. దీనిలో ఒక ఆర్థిక సంవత్సర కనీస డిపాజిట్ రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఖాతా దీర్ఘకాలం కొనసాగుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధి కలిగి ఉంటుంది. డిపాజిట్లయితే 15 ఏళ్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఖాతాలో డిపాజిట్లు చేయకపోయినా మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది.
అమ్మాయి, ఖాతా మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నిధిని, వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. ఈ మొత్తం ఉపసంహరణకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు.
18 ఏళ్లు నిండిన తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించి తన ఖాతాను సొంతంగా నిర్వహించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకుని ఖాతాను మూసివేయొచ్చు.
లేదా ఖాతాలో ఉన్న సొమ్మును పాక్షికంగా కూడా ఉపసంహరించుకుని ఖాతాను కొనసాగించవచ్చు. ఉపసంహరణ ఫారంను పూర్తిచేసి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతా నుంచి పాక్షికంగా, పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. అవేంటో చూద్దాం.
విద్య:
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినా లేదా 10వ తరగతి విద్యను పూర్తి చేసినా..విద్యా ప్రయోజనాల కోసం నగదు అవసరాలకై ఈ ఖాతా నుంచి ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం, కళాశాల/యూనివర్సిటీ విద్యా ప్రవేశానికి సంబంధించిన సరైన పత్రాలు (ధ్రువీకరించబడిన ప్రవేశ ఆఫర్, ఫీజు వివరాల కాపీలను) సమర్పించాలి. మునుపటి సంవత్సరం ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తంలో 50% మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
వివాహం:
ఖాతాదారైన అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత, పెళ్లికి సంబంధించి..వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన 3 నెలల తర్వాత ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహానికి సంబంధించిన రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.
మరణం:
ఖాతాదారైన అమ్మాయి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఖాతాకు సంబంధించిన హక్కు ఖాతా ప్రారంభించిన వ్యక్తికి లభిస్తుంది. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత డిపాజిట్ నిల్వ మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు.
పౌరసత్వం:
ఖాతాను ప్రారంభించినప్పుడు అమ్మాయికి భారత పౌరసత్వం ఉన్నప్పటికీ..తర్వాత డిపాజిట్ కాలవ్యవధిలో పౌరసత్వం కోల్పోతే ఖాతా క్లోజ్ చేస్తారు. ఈ వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయాలి.
సంరక్షకుల మరణం:
ఖాతాను ప్రారంభించిన తల్లిదండ్రులు/సంరక్షకుడు మరణించిన సందర్భంలో ఖాతాదారైన అమ్మాయికి ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసేయొచ్చు. అయితే, ఇలాంటి ఉపసంహరణకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఆమోదం తప్పనిసరి.
అత్యవసర పరిస్థితులు:
అమ్మాయికి ప్రాణాంతక వ్యాధి లేదా ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో..వీటికి సంబంధించిన పత్రాలు సమర్పిస్తే మొత్తం డిపాజిట్, వడ్డీతో సహా ఉపసంహరించుకుని ఖాతా మూసివేయడానికి అనుమతి ఉంటుంది.
0 Comments:
Post a Comment