Pollution: దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల.. తొలి స్థానంలో ఏ నగరమంటే?
పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ దేశంలోని చిన్న నగరాలను సైతం కాలుష్య కోరల్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది.
కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగాలుచర్యలు చేపడుతున్నప్పటికీ, దేశంలో పలు నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. మొత్తం 163 నగరాలకు సబంధించిన గాలి నాణ్యత ప్రమాణాల వివరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో బిహార్లోని కతిహర్ నగరంలో గాలి నాణ్యత (360 పాయింట్లు) పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. దిల్లీ(354 పాయింట్లు), నోయిడా (328), ఘజియాబాద్ (304) నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బిహార్లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్ఘర్, ఫరిదాబాద్, కైతాల్, గుడ్గావ్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లను అత్యంత కాలుష్య నగరాలుగా సీపీసీబీ నిర్ధరించింది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం నగరాల గాలి నాణ్యత వివరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో విశాఖపట్టణం (202 పాయింట్లు) లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఇక హైదరాబాద్ (100), అనంతపురం (145), ఏలూరు (61), తిరుపతి (95)గా ఉన్నట్లు తెలిపింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టడం, వాహనాలు విడుదల చేసే కర్భన ఉద్గారాల కారణంగా దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోందని సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పంజాబ్లో ఒక్క రోజులోనే పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 చోటుచేసుకున్నట్లు తెలిపింది.
0 Comments:
Post a Comment