Oil Prices: భారీగా తగ్గిన వంట నూనె ధరలు.. కేంద్రం కీలక ప్రకటన!
Edible Oil Rates | వంట నూనె ధరలు భారీగా తగ్గాయి. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Oil Rates) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలల కాలంలో వంట నూనె (Edible Oils) ధరలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం ఇందుకు కారణంగా పేర్కొంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ధరలు తగ్గాయని తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ రేట్లు గత రెండు నెలల కాలంలో 200 నుంచి 300 డాలర్లవరకు తగ్గాయని కేంద్రం పేర్కొంది. దీంతో దేశీ మార్కెట్లో కూడా ధరలు తగ్గుతూ వచ్చాని తెలిపింది. గత ఆరు నెరలల కాలంలో ఆర్బీడీ పామోలిన్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వనస్పతి ధరలు వరుసగా 26 శాతం, 9 శాతం, 12 శాతం, 9 శాతం, 11 శాతం చొప్పున తగ్గాయని వివరించింది.
దేశవ్యాప్తంగా చూస్తే.. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రేటు కేజీకి రూ. 170గా ఉందని పేర్కొంది. ఇదివరకు ఈ రేటు రూ.181గా ఉండేది. అలాగే వనస్పతి రేటు కేజీకి రూ. 154 నుంచి రూ. 146కు తగ్గింది. రిఫైన్డ్ సోయాబీన్ ధర కేజీకి రూ. 157 నుంచి రూ. 154కు క్షీణించింది. మస్టర్డ్ ఆయిల్ రేటు కేజీకి రూ. 173 నుంచి రూ. 170కు తగ్గింది. ఆర్బీడీ పామోలిన్ రేటు అయితే కేజీకి రూ. 138 నుంచి రూ. 119కు పడిపోయింది.
దిగుమతి సుంకాల తగ్గింపు, సెస్ కోత, టారిఫ్ ధరల క్రమబద్దీకరణ, స్టాక్ లిమిట్ ఆంక్షల విధింపు, బఫర్ స్టాక్ మెయింటెనెన్స్ వంటి పలు నిర్ణయాల కారణంగా వంట నూనె ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల కాలంలో ధరలు తగ్గడం వల్ల కేంద్ర ప్రభుత్వం స్టాక్ లిమిట్ను ఎత్తి వేసింది. దీంతో రిటైలర్లు ఎక్కువ వంట నూనె స్టాక్ను కొనుగోలు చేయొచ్చు. అయితే రానున్న కాలంలో వంట నూనె ధరలు పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ రానున్న కాలంలో మనపై ప్రభావం చూపొచ్చు. అలాగే టారిఫ్ ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి. అందువల్ల సామాన్యులపై ప్రభావం పడొచ్చు.
0 Comments:
Post a Comment