చాలామంది రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గుతామని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు నిజంగానే రాత్రి పూట భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? రాత్రిపూట భోజనం మానేయడం వల్ల ఫలితం ఉందా?
లేదా రాత్రి పూట భోజనం మానేయడం వల్ల దుష్ఫలితాలు వస్తాయా? ఆరోగ్యంగా బరువు తగ్గటానికి అసలేం చెయ్యాలి? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
రాత్రి భోజనం మానెయ్యొచ్చు.. కానీ ఈ విషయంలో జాగ్రత్త
రాత్రి వేళ భోజనం మానెయ్యటం అందరికీ మంచిది కాదు. ఒబేసిటీ ఉన్నవారు బరువు తగ్గటం కోసం రాత్రివేళ ఆహారంపై నియంత్రణ కలిగి ఉండాలని చెప్తున్నారు. విపరీతంగా బరువు ఉన్న వారిని సహజంగా వైద్యులు కూడా రాత్రివేళ అన్నానికి బదులు చపాతీ కానీ, జొన్నరొట్టె కానీ తినమని సలహా ఇస్తూ ఉంటారు. అన్నంలో విపరీతమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి అన్నానికి దూరంగా ఉండాలని సూచిస్తారు. అయితే మొత్తానికి రాత్రి పూట ఏమీ తినకుండా డైటింగ్ చేసేవారు, వారి శరీరానికి కావలసిన పౌష్టికాహారం తీసుకోకపోతే అది వేరే అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు.
సాధ్యమైనంత త్వరగా ఏడు గంటలలోపే భోజనం బెస్ట్
రాత్రివేళ ఆహారం తీసుకోకుండా, రోజంతా తీసుకునే ఆహారంలో కూడా పోషకాలు లేకుంటే శరీరంలో ఎనర్జీ లేకుండా చేస్తుందని, కండరాలను వీక్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి రాత్రిపూట భోజనం చేయకుండా డైటింగ్ చెయ్యాలి అని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రాత్రి భోజనం మానెయ్యటం కంటే సాధ్యమైనంత వరకు సాయంత్రం త్వరగా భోజనం చెయ్యటం మంచిది. ఏడు గంటల లోపే తింటే మంచిది. భోజనానికి, నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉంటే మంచిదని అంటున్నారు.
రాత్రి భోజనం మానెయ్యాలి అనుకుంటే ఈ విషయాలు గుర్తి పెట్టుకోండి
రాత్రి సమయంలో ఏమి తినకూడదు అని భావించిన వారు సాయంత్రం వేళలో కనీసం ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఒకపూట భోజనం మానేయడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు తగ్గుతాయి కాబట్టి, పోషక లోపాలు లేకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని చెబుతున్నారు. వెజ్ సలాడ్ లు, ఫ్రూట్ సలాడ్ లు సాయంత్రం సమయంలో తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకొని, ఉప్పు, చక్కెర తో తయారు చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
సరైన పౌష్టికాహారం శరీరానికి అవసరం
సరైన ఆహారం తీసుకోకుండా రాత్రివేళ డైటింగ్ చేస్తే ఎసిడిటీ సమస్య వస్తుందని, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, శరీరానికి కావాల్సిన శక్తి లేక కొత్త సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే డైటింగ్ వల్ల వచ్చే ఇతరత్రా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చునని సలహా ఇస్తున్నారు. అన్నిటికంటే ఎప్పుడు ఎవరు ఏం తిన్నా మితాహారాన్నే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఎడా పెడా రాత్రి భోజనం మానెయ్యటం కాకుండా ఒక సాయంత్రంలోపు మంచి పౌష్టికాహారం తినాలని, బరువు పెంచే పదార్ధాలకు దూరంగా ఉండాలని అంటున్నారు.
0 Comments:
Post a Comment