Padampani School : మారుతున్న వాతావరణ పరిస్థితులు రాబోయే తరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్(Global Warming) ఏటా పెరిగిపోతుంది.
దీంతో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని నిర్ణయించింది బిహార్లోని ఒక పాఠశాల. ఇందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్(Bihar) బోద్గయ దగ్గర సేవా బిఘా ప్రాంతంలో పద్మపాణి (Padampani) అనే స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరిస్తారు.
స్కూల్ స్టూడెంట్స్కు చినప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం ప్రతి రోజు ఇంట్లో పోగయ్యే చెత్త, వ్యర్థాలను తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను కోరింది. దీంతో పిల్లలు రోజు ఇంటి నుంచి చెత్త తీసుకొచ్చి స్కూల్ గేటు దగ్గర ఉన్న డస్ట్బిన్లో వేస్తుంటారు.
మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పద్మపాణి స్కూల్ యాజమాన్యం చెబుతోంది.
వచ్చిన ఆదాయం పిల్లల చదువు కోసమే
విద్యార్థులు సేకరించిన వ్యర్థాలను విక్రయించడం ద్వారా పాఠశాల ఆదాయం పొందుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రతి రోజు రీసైకిల్ చేయడానికి పంపుతారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లల చదువులకు, యూనిఫామ్, నోట్బుక్స్, ఫుడ్ తదితర వాటిపై వెచ్చిస్తున్నారు.
బాధ్యత కోసమే
పాఠశాల ఫీజులను చెత్త రూపంలో తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం పిల్లలకు సామాజిక బాధ్యతను అలవాటు చేయడమే అంటున్నారు పద్మపాణి స్కూల్ హెడ్ మాస్టర్ మీరా కుమారి. తద్వారా వారు గ్లోబల్ వార్మింగ్ వంటి పర్యావరణ సమస్యలపై బాల్యం నంచే అవగాహన పెంచుకుంటారని న్యూస్18తో చెప్పారు.
చారిత్రక వారసత్వ ప్రాంతమైన బుద్ధగయలో అందరూ పరిశుభ్రత పాటించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వివరించారు.
బుద్ధగయ పరిశుభ్రత కోసం
గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశంగా బుద్ధగయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు.
దీంతో ఈ ప్రాంతాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో నలుగురికి అవగాహన కల్పించడం కోసం కూడా పద్మపాణి స్కూల్ ఈ విన్నూత కార్యక్రమాన్ని చేపడుతోంది.
సోలార్ పవర్ మరో ప్రత్యేకత
ఈ స్కూల్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణలో మిగతా పాఠశాలల కంటే ఆదర్శంగా నిలుస్తోంది. పదంపాని స్కూల్కు విద్యుత్ కనెక్షన్ లేదు.
సోలార్ పవర్ ద్వారా అవసరమైన కరెంట్ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు. తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించడంలో తమ వంతుగా ఈ స్కూల్ కృషి చేస్తోంది.
అన్నీ ఉచితమే
250 మంది విద్యార్థులు పైగా చదువుకుంటున్న పద్మపాణి స్కూల్ను 2014లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు పాఠాలు చెబుతారు.
మెరుగైన విద్య నేర్పడంతో పాటు మన సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత విద్యతో పాటు ఆహారం, పుస్తకాలు, స్టేషనరీ తదితర వాటిని యాజమాన్యమే ఉచితంగా అందిస్తోంది.
0 Comments:
Post a Comment