CM Jagan: ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన ఉండనుంది. పీపీ వన్ నుంచే ప్రారంభించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇంటరాక్టివ్ డిస్ప్లే, ప్రొజెక్టర్లతో పిల్లలకు చదువు చెప్పనున్నారు. విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా డిజిటల్ డిస్ ప్లేలకు సంబంధించిన వివిధ కంపెనీల ఉపకరణాలను పరిశీలించారు.
రెండో దశ నాడు-నేడు పనులపై సీఎం జగన్ ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో విలువైన వస్తువులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో భద్రతను రెట్టింపు చేయాలన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తరగతి గదుల్లో డిజిటల్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని చెప్పారు.
తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ టీవీలు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. వచ్చే వారం నాటికి దీనిపై కార్యాచరణతో రావాలన్నారు సీఎం జగన్. 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్లపై ఆరా తీశారు.
ట్యాబ్లన్నీ నాణ్యతతో ఉండేలా చూడాలన్నారు. విద్యా రంగంలో అనేక సంస్కరణాలు తీసుకొచ్చామని..ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
విద్యా శాఖలో డీఈవో, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు సీఎం జగన్. ఎస్సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీపై ఫోకస్ చేయాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఇతర విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment