తాగునీటి కోసం నెత్తిన బిందెలు పెట్టుకుని, ఎర్రటి ఎండలో కిలోమీటర్ల కొద్దీ నడిచే తల్లీబిడ్డలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి...
*వాటర్ వీల్స్!* మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గుక్కెడు నీళ్ల కోసం మహిళలు, చిన్నారులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బిందెపై బిందె పెట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి నిత్యం ఎగుడుదిగుడు దారుల్లో నడుస్తున్న కారణంగా... వీరిలో చాలామందిలో మెడ, నడుము, కండరాల నొప్పులు (మస్క్యులోస్కెలెటర్ డిజార్డర్స్), ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయి.
రోజులో ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికే సరిపోవడంతో మహిళలు ఎలాంటి ఉపాధి చేపట్టడం కుదరడంలేదు. బాలికలూ చదువులకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పలు స్వచ్ఛంద సంస్థలు... సాంకేతిక నిపుణుల సాయంతో కొన్నేళ్ల కిందటే ఈ వాటర్ వీల్స్కు రూపమిచ్చాయి.
ఒకేసారి 50 లీటర్ల నీటిని నింపి సులభంగా తోసుకొచ్చేలా నిపుణులు వీటిని తయారుచేశారు. నాణ్యమైన ప్లాస్టిక్తో, ఎలాంటి నేలనైనా తట్టుకుని దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించారు. వీటిలో సులభంగా నీళ్లు నింపుకోవచ్చు. హ్యాండిల్స్ సాయంతో తోసుకువెళ్లడమూ సులభమే.
వీటి రాకతో నీళ్ల భారం తప్పి కొందరు బాలికలు బడిబాట పడుతున్నారు. మహిళలు ఉపాధి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో పలు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు మారుమూల గ్రామాల్లోని పేద కుటుంబాలకు వీటిని అందిస్తున్నాయి. ఒక్కో డ్రమ్ తయారీకి సుమారు రూ.2,500 ఖర్చవుతున్నా, వాటిని ఉచితంగా లేదంటే రాయితీ ధరలకే ఇస్తున్నాయి.
0 Comments:
Post a Comment