ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీ ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి.
ఇవాళ కూడా ధరలను సవరిస్తూ.. చిరు వ్యాపారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఒకేసారి రూ.104 పెంచాయి.
దేశరాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.102.5 పెరిగింది. మే 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ కొనాలంటే రూ.2355.5 వెచ్చించాల్సి ఉంటుంది. ముంబైలో రూ.2205కి బదులు రూ.2329.50 చెల్లించాలి. కోల్కతాలో రూ.2351కి బదులు 2477.50 ఖర్చు చేయాలి. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2406 నుంచి రూ.2508కి పెరిగింది.
హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2563.5కి పెరిగింది. గతంలో దీని ధర రూ.2460 ఉండేది. విశాఖపట్టణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2321 నుంచి రూ.2413కి పెరిగింది. విజయవాడలో గతంలో రూ.2420గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2501కి అందుబాటులో ఉంది.
గత నెలలో కూడా ఎల్పీజీ సిలిండర్ రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న 19 కేజీల సిలిండర్ ధర ఒకేసారి రూ.250 పెరిగింది. తాజాగా రూ. 104 పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఎల్పీజీ రేట్లు ఎగబాకుతుండడంతో.. హోటల్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
సామాన్య ప్రజలు వినియోగించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. గత నెల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటున రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1002 వద్ద స్థిరంగా ఉంది.
విజయవాడలో గృహ వినియోగ 14.2 ఎల్పీజీ సిలిండర్ ధర రూ.973గా ఉంది. విశాఖపట్టణంలో రూ.958కి లభిస్తోంది. కమర్షియల్ సిలిండర్లు పెరిగినా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగకపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది.
కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వల్ల.. అది సామాన్య ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది. స్వీట్ షాప్, బేకరీ, టీ స్టాల్, హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశముంది. తద్వారా సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. వంటనూనె, ఎల్పీజీ ధరలు పెరగడంతో చాలా హోటళ్లు, బేకరీలు ధరలను ఇప్పటికే పెంచాయి.
0 Comments:
Post a Comment