ఆదిల్ శెట్టి
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది.
ఈ సోమవారం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్(All Time) కనిష్ట స్థాయి 77.50కి పడిపోయింది.
ప్రస్తుతం కొనసాగుతున్న స్థూల-ఆర్థిక పరిస్థితుల (macro-economic issue) దృష్ట్యా మే చివరి నాటికి రూపాయి(Rupee) విలువ 78కి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ స్టాక్లలో(Indian Stocks) అమ్మకాలు(Sales) కొనసాగించడం, ముడి చమురు ధరలు, దేశీయ ద్రవ్యోల్బణం(Inflation) పెరగడం వంటివి రూపాయి పతనానికి దోహదపడే అంశాలు.
వడ్డీ రేట్లలో మార్పుల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఇది ఇండియన్ కరెన్సీ(Indian Currency) విలువను మరింత దిగజార్చవచ్చు.
US డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడినప్పుడు, డాలర్తో లింక్ అయిన వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇండియన్ రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, భారతీయులకు డాలర్ మరింత ఖరీదైనదిగా మారుతుంది.
ఫలితంగా మనం దిగుమతి చేసుకుంటున్న వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోవడం స్థూల ఆర్థిక సమస్యగా మాత్రమే కనిపించవచ్చు.
కానీ కొంచెం లోతుగా విశ్లేషిస్తే.. ఇది ప్రతి భారతీయుడిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ క్షీణించినప్పుడు ప్రజలపై పడే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
రోజువారీ ఖర్చుల పెరుగుదల
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. భారతదేశం ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇంధనం ధరలు మరింత పెరుగుతున్నాయి.
దీంతో రవాణా ఖర్చులు పెరిగి, ప్రజలు వినియోగించే రోజువారీ సరుకులపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. చమురుతో ముడిపడి ఉన్న ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాటి ధరలు పెరుగుతాయి.
ఎలక్ట్రానిక్స్ కూడా ఖరీదైనవిగా మారుతాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, సోలార్ ప్లేట్లు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు వివిధ రకాల డివైజ్లకు చెందిన విడి భాగాలను మనం దిగుమతి చేసుకుంటున్నందువల్ల, వీటికి చెల్లించాల్సిన ఖర్చు మరింత పెరుగుతుంది.
విదేశీ విద్యపై ప్రభావం
రూపాయి విలువ క్షీణించడంతో విదేశాల్లో విద్య మరింత ప్రియం కానుంది. బయట దేశాల్లో చదువుతున్న విద్యార్థులు(Students) లేదా ఉన్నత విద్య కోసం వేరే దేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు డాలర్లలో ఖర్చు చేయాలి.
రూపాయి మారకం రేటు పెరగడంతో డాలర్లను కొనుగోలు చేయడానికి వారు ఎక్కువ మొత్తంలో భారత కరెన్సీని వెచ్చించాలి. దీంతో విదేశీ విద్యకు కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది.
ఒకవేళ విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ ఎంచుకుంటే, రూపాయి పరంగా వారి లోన్ విలువ మొత్తం పెరుగుతుంది. కానీ నెలవారీ వాయిదాలు (EMIలు) మాత్రం అలాగే ఉంటాయి.
విదేశీ ప్రయాణం
ఈ వేసవిలో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి ఈసారి ఖర్చులు పెరుగుతాయి. వీరి ట్రిప్ కాస్ట్, ముందుగా వేసుకున్న బడ్జెట్ను మించిపోవచ్చు.
ఉదాహరణకు US డాలర్తో రూపాయి మారకం విలువ 75 వద్ద ఉన్నప్పుడు మీరు $10,000 వెచ్చించాలనుకుంటే.. ఈ విలువ రూ. 7.5 లక్షలు అవుతుంది. అయితే ఇప్పుడు రూపాయి విలువ 78కి పడిపోవడంతో.. అదే మొత్తంలో డాలర్ల కోసం రూ.30,000 ఎక్కువగా ఖర్చు చేయాలి.
చెల్లింపులు (Remittances)
రూపాయి విలువ క్షీణించడంతో విదేశాల నుంచి భారతీయులు పొందే రెమిటెన్స్ల విలువ పెరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి డబ్బు పంపే కుటుంబాలకు రూపాయల్లో ఎక్కువ మొత్తం చేతికి అందుతుంది.
ఫారెన్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్
US స్టాక్స్లో ప్రస్తుతం పెట్టుబడులు ఉన్నవారు, రూపాయి విలువ పతనం కారణంగా ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు రూపాయి-డాలర్ మారకం విలువ 70గా ఉన్నప్పుడు మీరు 'A' అనే కంపెనీలో 100 షేర్లను $10కి కొనుగోలు చేశారనుకుందాం.
దీని అర్థం మీరు ఒక్కో షేర్లో రూ. 700 చొప్పున మొత్తం రూ. 70,000 ($1000) ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు స్టాక్ ధర $15కు పెరిగింది అనుకుందాం. US డాలర్ టర్మ్లో మీ మొత్తం స్టాక్ విలువ ఇప్పుడు $1500. రూపాయి టర్మ్లో మారకం విలువ ఇప్పటికీ 70 వద్ద ఉంటే, మీ పెట్టుబడి మొత్తం విలువ రూ.1,05,000 అవుతుంది.
అయితే ప్రస్తుతం మారకం రేటు 77 వద్ద ఉంది. ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మీరు రూ. 1,15,500 పొందుతారు. అంటే అదనంగా రూ. 10,500 లాభం అన్నమాట.
అయితే మీరు ప్రస్తుతం US స్టాక్స్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం, స్టాక్స్ కోసం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
0 Comments:
Post a Comment