Oil Prices: వచ్చే నెలలో భారీగా పెరగనున్న వంటనూనె ధరలు.. సామాన్యులకు బిగ్ షాక్ తప్పదా?
ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేసే దేశం...
ఇండోనేసియా. కానీ ఇప్పుడా దేశంలో కూడా పామాయిల్ సంక్షోభం నెలకొంది. ద్రవ్యోల్పణ నేపథ్యంలో ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బంగారంలా మారాయి.
పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె, దాని ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. ఏప్రిల్ 28 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
ఇంట్లో ఆహార ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడమే పాలసీ లక్ష్యమనిని జోకో విడోడో అన్నారు. దేశీయ విపణిలో వంటనూనెల లభ్యత సమృద్ధిగా , అందుబాటు ధరలో ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండోనేసియా పామాయిల్ ఎగుమతులను నిలిపివేయడం వల్ల..ఆ ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడుతుంది. ఎందుకుంటే మన దేశం ఇండోనేసియా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ను కొనుగోలు చేస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ఆ నూనె భారత్కు రాదు. అప్పుడు పామాయిల్ కొరత ఏర్పడి.. ధరలు భారీగా పెరిగే అవకాశముంది.
వంట నూనెల విషయంలో మనదేశంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా 13-13.5 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 8-8.5 మిలియన్ టన్నులు పామాయిలే కావడం విశేషం. అంటే 63శాతం పామాయిల్ను మనం దిగుమతి చేసుకుంటున్నాం.
భారత్ ఏటా దిగుమతి చేసుకునే 8-8.5 మిలియన్ టన్నుల పామాయిల్లో 45శాతం ఇండోనేసియా నుంచే వస్తుంది. మిగతాది మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇండోనేసియా ఎగుమతులపై నిషేధం విధించింది. పక్కనున్న మలేషియాలోనూ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది.
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఇండోనేసియా, మలేసియా నుంచి కూడా దిగుమతులు పడిపోతే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వంటనూనె ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments:
Post a Comment