✍️8 నిమిషాలకే పేపర్ బయటకు
♦మూడోరోజూ కొనసాగిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర
♦వాట్సప్లో ప్రత్యక్షమైన ఇంగ్లిషు పేపరు
♦శ్రీ సత్యసాయి జిల్లా వైకాపా నాయకుల గ్రూపుల్లో వైరల్
🌻ఈనాడు డిజిటల్ - అనంతపురం
న్యూస్టుడే-అమడగూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లో పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు, హిందీ పేపర్లు బయటికి రాగా.. మూడో రోజు ఆంగ్ల ప్రశ్నపత్రం కూడా లీకయింది. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన వైకాపా నాయకుల వాట్సప్ గ్రూప్లో శుక్రవారం పదోతరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవగా 9.38 కల్లా వాట్సప్ గ్రూపుల్లోకి చేరింది. దీనిపై మీడియా ద్వారా సమాచారం అందుకున్న డీఈవో విచారణ చేపట్టారు. నల్లచెరువు మండలం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు సెల్ఫోన్ ద్వారా వైకాపా నాయకుల గ్రూప్లోకి ప్రశ్నపత్రం వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సీల్డ్కవర్ నుంచి తీయగానే ఫొటో
పరీక్ష కేంద్రంలో సీల్డ్కవర్ నుంచి ప్రశ్నపత్రాలను బయటకు తీసిన వెంటనే సెల్ఫోన్లో ఫొటోలు తీసి పంపినట్లు వాట్సప్ గ్రూప్లో వచ్చిన చిత్రాలను బట్టి అర్థమవుతోంది. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా డీఈవో నాగేశ్వరరావును వివరణ కోరగా.. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ద్వారానే వైకాపా గ్రూపుల్లోకి ప్రశ్నపత్రం వెళ్లినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. కేసు నమోదు చేసి, విచారణ జరిపిస్తామన్నారు.
♦లీకైంది గాండ్లపెంటలో..
కదిరి, గాండ్లపెంట, న్యూస్టుడే: ఆంగ్లŸపరీక్ష ప్రశ్నపత్రం గాండ్లపెంటలో లీకైనట్లు అధికారులు తేల్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా విచారణ కొనసాగింది. తొలుత అమడగూరులో లీకైనట్లు ప్రచారం జరిగింది. దీంతో శ్రీసత్యసాయి డీఈవో నాగేశ్వరరావు, ఎంఈవో వేమనారాయణ తదితరులు అమడగూరుకు చేరుకుని విచారించి, అక్కడి పాఠశాలకు సంబంధం లేదని గుర్తించారు. శ్రీనివాసరావు సెల్ఫోన్ లొకేషన్ గాండ్లపెంటలో చూపడంతో అక్కడికి చేరుకున్నారు. గాండ్లపెంట జడ్పీ హైస్కూలు, పరిసరాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ విజయకుమార్, వాటర్బాయ్ నరేష్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుస్టేషన్లో సీఐ మధు, ఎస్సై మల్లికార్జునరెడ్డి విచారించారు. లీకు సూత్రధారులు పరీక్ష కేంద్రం చీఫ్, వాటర్బాయ్ అని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రశ్నపత్రం వాటర్బాయ్ బయటకు తీసుకురాగా, కేంద్రం చీఫ్ సెల్ఫోన్లో ఫొటోతీసి శ్రీనివాసరావుకు పంపినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనపై డీఈఓ గాండ్లపెంట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు
* నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటు శ్రీనివాసరావు, గాండ్లపెంటలో చీఫ్గా వ్యవహరిస్తున్న విజయకుమార్ మధ్య పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రశ్నపత్రం లీకు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
0 Comments:
Post a Comment