కృష్ణా జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాపకింద నీరులా సాగుతున్న గంజాయి అక్రమ దందా నేపథ్యంలో పాఠశాల విద్యార్థులను అక్రమార్కులు గంజాయి మత్తులోకి దించుతున్నారు.
ఒక్క గంజాయి మాత్రమే కాదు టిన్నర్(థిన్నర్), రబ్బరు, ప్లాస్టిక్లను అతికించే కొన్నిరకాల గమ్ లు , గోళ్ల రంగులు, వైట్నర్ లాంటివి కూడా మత్తు కోసం విద్యార్థులు ఉపయోగిస్తున్నారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దమ్ మారో దమ్.. కృష్ణా జిల్లా స్కూళ్ళలో గంజాయి గుప్పు
కృష్ణా జిల్లాలో స్కూల్స్ లో విద్యార్థులు దమ్ మారో దమ్ అంటూ మత్తులో తూగుతున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బ్లాక్ బోర్డ్ వైపు చూస్తూ మగతగా నిద్ర లోకి జారుకుంటున్నాడు.
ఇక ఈ విషయాన్ని పలుమార్లు గుర్తించిన ఉపాధ్యాయులు, తరగతిగదిలో ఇలాగే మత్తుగా నిద్ర పోతున్న విద్యార్థుల పై దృష్టి సారించారు.
ఇక వీరి కదలికలు, వీరి పరిచయాల పై నిఘా వేసిన ఉపాధ్యాయులు, విశ్రాంతి సమయంలో సదరు విద్యార్థులు పాఠశాల ప్రహరీ అవతల ఉన్న విద్యార్థుల నుండి గంజాయిని తీసుకుంటున్నట్టు గా గుర్తించారు. అనుమానంతో తనిఖీ చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థుల వద్ద చిన్న గంజాయి పొట్లాలు దొరికాయి.
ప్రభుత్వ బడులే కాదు, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి దందా
ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు విజయవాడకు సమీపంలో ఉన్న మరో కార్పొరేట్ పాఠశాలలో ఇటీవల ఇటువంటి ఘటన వెలుగు చూసింది. కార్పొరేట్ పాఠశాల ప్రహరీ గోడ పై నుండి చిన్నచిన్న పొట్లాలు లోపల పడడాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తించారు.
ఆ పొట్లాలను తెరిచి చూసిన సిబ్బంది వాటిలో గంజాయి ఉందని నిర్ధారించుకున్నారు. ఇక ఈ విషయం బయటకు రాకుండా కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం జాగ్రత్త పడింది. ఆ తర్వాత పోలీసుల సహకారంతో పాఠశాల వద్ద నిఘాను ఏర్పాటు చేసుకుంది.
కృష్ణాజిల్లాలో పాఠశాల విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్నారు అని చెప్పడానికి ఈ రెండు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు.
గంజాయి తాగుతున్న విద్యార్థులను పట్టుకుంటున్న స్కూల్స్ ఉపాధ్యాయులు
కృష్ణా జిల్లాలో విద్యార్థులు మత్తుకు ఎంతగా బానిసలుగా మారారు అంటే ఈ మత్తు పదార్థాలను వినియోగించడానికి సన్నటి గొట్టాలు, పాలిథిన్ కవర్లను విద్యార్థులు కొని వారి దగ్గర పెట్టుకుంటున్నారు.
తాజాగా రెండు పాఠశాలల సమీపంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు మత్తుకు బానిసలు అవుతున్నారని గుర్తించి మాటు వేసి మరీ గంజాయి తీసుకుంటున్న ఆరుగురు విద్యార్థులను పట్టుకున్నారు.
గత 3 నెలల్లో 8 సార్లు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బడి గేటుకు కొన్నిచోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
గంజాయి తీసుకుంటున్నట్టు ఒప్పుకుంటున్న చిన్నారులు
పట్టుబడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మారని విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై ప్రధానోపాధ్యాయులు తర్జనభర్జనల్లో ఉన్నారు.
ఇక విద్యార్థులు కూడా తాము గంజాయి తీసుకుంటున్నట్టు ఒప్పుకున్నారు. ఇలా వివిధ పాఠశాలల్లో గంజాయి తీసుకుంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ద్వారా అందరికీ గంజాయి చేరుతుందని వారు చెబుతున్నారు.
జిగురు ట్యూబ్ లను విద్యార్థులకు విక్రయించ వద్దని షాప్ ల నిర్వాహకులకు పోలీసుల సూచన
కొత్తగా పీల్చినవారికి దగ్గు వస్తుంది. రెండు మూడు రోజులకు అలవాటవుతుందని విద్యార్థులు అంటున్నారు. పీల్చగానే హుషారుగా, ఆనందంగా ఉంటుందని, తలకు మత్తు ఎక్కుతుందని వారు తెలిపారు.
ఎవరైనా కర్రతో కొట్టినా నొప్పి ఉండదు అని విద్యార్థులు గంజాయి తాగడం వల్ల తమకు హాయిగా, మత్తుగా ఉందని చెబుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది.
కృష్ణా జిల్లాలో విద్యార్థులు మత్తుకు బానిస గా మారుతున్న నేపథ్యంలో వివిధ కంపెనీల జిగురు ట్యూబ్ లను విద్యార్థులకు విక్రయించ వద్దని పోలీసులు, ప్రధానోపాధ్యాయులు, దుకాణదారులకు సూచిస్తున్నారు.
విద్యార్థులను టార్గెట్ చేసుకుని బడ్డీ షాప్ లలోనూ గంజాయి విక్రయాలు
కొంతమంది వ్యాపారులు విద్యార్థులకు ఈ ట్యూబ్ లను విక్రయిస్తున్నారు. రూ.30 విలువ చేసే ట్యూబ్ను రూ.100కి విక్రయిస్తూ డబ్బు కోసం విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారు .
ఇక కృష్ణాజిల్లాలో మూడు నెలల క్రితం కొన్ని బడ్డీ షాప్ లలో గంజాయి లభ్యమైంది అంటే ఏ రేంజ్ లో గంజాయి దందా దొరుకుతుందో అర్థం చేసుకోవచ్చు.
పాఠశాల విద్యార్థులు టార్గెట్ గా చేసుకొని కొందరు ఇలాంటి మత్తు వ్యాపారానికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాంటి వారిని గుర్తించి కట్టడి చేసే పనిలో పోలీసులు రంగంలోకి దిగారు.
స్కూల్స్ లో గంజాయి మత్తుపై పోలీసులు సీరియస్.. స్కూల్స్ పై పోలీసుల నిఘా
కృష్ణా జిల్లాలో స్కూల్స్ చదువుతున్న చిన్నారులను టార్గెట్ చేస్తూ సాగుతున్న మత్తు వ్యాపారంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటివి సహించేది లేదని తేల్చి చెబుతున్నారు.
బాలలకు మత్తు అలవాటు చేస్తున్న వారిపై నిఘా పెట్టామని, తల్లిదండ్రులు కూడా పిల్లలపైన శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.
విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేస్తున్న ప్రధాన సమస్యను పరిష్కరించడం కోసం అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
0 Comments:
Post a Comment