AP Sub-Registrar: సబ్ రిజిస్ట్రార్లకు బినామీలుగా డాక్యుమెంట్ రైటర్లు.. జీవో రిలీజైనా పట్టించుకోని అధికారులు
అవినీతిమయంగా మారిన ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో.. పరిస్థితి మారలేదా? ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లు, అనధికార వ్యక్తులను అనుమతించొద్దని… స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసినా..
అధికారులు అమలు చేయడం లేదా? వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉందా? ఇటీవల ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో.. ఏసీబీ జరిపిన దాడుల సందర్భంగా.. సబ్ రిజిస్టార్ల లంచాల వసూళ్లకు.. డాక్యుమెంట్ రైటర్లే బినామీలుగా ఉంటున్నారని తేలడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ రైటర్లతో పాటు, అనధికారిక వ్యక్తులెవరూ ఆఫీసుల్లోకి రావొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ రెవెన్యూ ఆఫీసుల్లో పరిస్థితి మాత్రం ఎప్పటిలాగానే ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్న 24 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో… రోజూ 1000 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి.. వందల మంది డాక్యుమెంట్ రైటర్లు, అనధికారిక వ్యక్తులు, జిరాక్స్ దుకాణాల్లో హవా కొనసాగిస్తున్నారు.
మామూలుగా, ప్రతి ఐదు వందల డాక్యుమెంట్లకు ఒక లైసెన్స్ రైటర్ ఉండాలి. జిల్లాలో లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్లు ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా లైసెన్స్ రెన్యువల్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. దీంతో బినామీల్లా మారిన రైటర్లు.. క్రయ విక్రయదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నేరుగా సబ్ రిజిస్టార్లను కలిసి.. రేటు మాట్లాడేసుకుంటున్నారు. పనైపోగానే ఎవరి వాటా వారికి పంపించేస్తున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు చేసిన ఏసీబీ.. సిబ్బందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఏ ఆఫీసును చూసినా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల 40 కేసులు నమోదు కాగా… కేవలం ఇద్దరికి మాత్రమే శిక్ష పడింది.
సబ్ రిజిస్ట్రార్ల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు.. ప్రభుత్వం ఈనెల 17న కొత్త జీవో ఇచ్చినా.. డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, ప్రభుత్వం తెచ్చిన జీవోపై మండిపడుతున్నారు. మూడు తరాలుగా నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. తమపై అవినీతి ముద్ర వేసి బయటకు గెంటివేయడం సరికాదంటున్నారు. తమను గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
0 Comments:
Post a Comment