ఆ విద్యార్థిని గెలుపు రూ.3 కోట్లు
తమిళనాట ఓ రైతు కుమార్తె 17 ఏళ్ల స్వెగ సామినాథన్ చికాగో విశ్వవిద్యాలయం నుంచి రూ.3 కోట్లు ఉపకారవేతనాన్ని దక్కించుకుంది. ఆమె విజయ రహస్యమేంటో తెలుసుకుందాం.
ఈరోడ్లోని కాశిపాలయం గ్రామానికి చెందిన రైతు దంపతులకు పుట్టిన స్వెగ సామినాథన్ చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేది. 16 ఏళ్లు వస్తే ఆడపిల్లకు వివాహం జరిపించాలనేది ఆ ప్రాంత సంప్రదాయం. అయితే ఆ దంపతులు మాత్రం తమ ముద్దుల కూతురికి చదువుపై ఉన్న ఆసక్తికే ప్రాముఖ్యత నిచ్చారు. గ్రామీణప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు డెక్సెటెరిటీ గ్లోబల్ సంస్థను 2008లో ప్రారంభించారు సాగర్ అనే సామాజిక కార్యకర్త. అలా స్వెగను ఆమె 14వ ఏట ఈ సంస్థ గుర్తించింది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే ఈమె కలను సాకారం చేయడానికి అప్పటి నుంచే ప్రత్యేక శిక్షణను అందించడం మొదలుపెట్టింది. రెండేళ్లలోనే చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు, కెరీర్ అభివృద్ధి వంటి కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయికి స్వెగ ఎదిగింది. తాజాగా ఇంటర్ పూర్తిచేసిన ఈమె ప్రపంచ ప్రసిద్ధి చెందిన చికాగో విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివే అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా, రూ.3 కోట్లు ఉపకారవేతనాన్ని కూడా గెలుచుకుంది.
నమ్మలేకపోతున్నా... ‘నాన్న చదువుకోలేదు. అమ్మ గృహిణి. మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ చదువుకోక పోయేసరికి నాకు పెద్ద చదువులు చదవాలని ఉండేది. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు డెక్సెటెరిటీ గ్లోబల్ సంస్థ వాళ్లు మా స్కూల్కు వచ్చారు. మంచి మార్కులు తెచ్చుకుంటూ, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న నాలాంటి కొందరిని ఎంపిక చేశారు. చదువుతోపాటు పలురకాల అంశాల్లో శిక్షణనిచ్చే తరగతులకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. అలా ఇంటర్ పూర్తిచేశా. ఈలోపు విదేశాల్లో డిగ్రీ చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాశా. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చికాగో విశ్వ విద్యాలయంలో నాకు సీటు రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అమ్మానాన్నల ఆనందానికి అంతులేదు. మా కుటుంబాల్లో నేను మాత్రమే చదువుకుంటుండగా, విదేశాలకు వెళ్లనున్న మొదటి దాన్ని కూడా నేనే కావడం గర్వంగా ఉంది. చదువు... ఆ తర్వాతే వివాహం అనే భావం అందరిలో రావాలని ఆశిస్తున్నా. సైంటిస్ట్గా ఎదిగి మన దేశానికి సేవలు అందించాలని ఉంది’ అని అంటోంది స్వెగ.
0 Comments:
Post a Comment