ATM: ఏటీఎంలో కెమెరాలకు రంగేశారు... 41 లక్షలు కొట్టేశారు
రెండు ఏటీఎంలలో దుండగుల చోరీ
నల్లరంగుతో సీసీ కెమెరాలు
కడప నేరవార్తలు, చింతకొమ్మదిన్నె, న్యూస్టుడే: కడప నగరం సమీపంలో రెండు చోట్ల ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన దుండగులు రూ.41 లక్షలు అపహరించారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఎస్బీఐ ఏటీఎం ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు సీసీ కెమెరాలకు నల్లని రంగు పూశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచి, రూ.17 లక్షలు తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది మంగళవారం చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రిమ్స్ ఠాణా పరిధిలోనూ రామాంజినేయపురం ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి ఆగంతుకులు రూ.24 లక్షలు దోచుకెళ్లారు. ఇక్కడా గ్యాస్ కట్టర్తోనే ఏటీఎంను తెరిచారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఓ కారు కాలిపోయి ఉంది. చోరులకు ఆ కారుకు సంబంధముందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment