గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఈ సెప్టెంబర్లో సంభవించిన గులాబ్ సైక్లోన్ వల్ల రైతులు భారీగా నష్టపోయారు.
పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతులకు పెట్టుబడి రాయితీ అందించారు. ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సాయం కింద రూ. 1,071 కోట్లు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు , రబీలో పంట నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద నేడు రూ.22 కోట్లను సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలని, అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని సీఎం పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని.. అందులో భాగంగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
0 Comments:
Post a Comment