🔳పీఆర్సీ నివేదికపై అధ్యయన కమిటీ ఏమైంది?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు
ఈనాడు డిజిటల్, అమరావతి: పీఆర్సీ నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎనిమిది మందితో నియమించిన కమిటీ ఏమైందని, కమిటీతో సంబంధం లేకుండానే పీఆర్సీ ప్రకటన ఉంటుందా? అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు ప్రశ్నించారు. వేతన సవరణపై ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబరు 31 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా ఉద్యమిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ క్రీడలో భాగంగానే పలు ఉద్యోగ సంఘాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నాయని, వాటితో తమకు సంబంధం లేదని వెల్లడించారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి తేల్చేస్తారన్న ఒక సంఘ నాయకుడి ప్రకటనపై ఉద్యోగులకు నమ్మకం లేదన్నారు. ‘‘అక్టోబరు 29న నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఆర్సీపై తేల్చేశారు. వేతన సవరణ కమిషన్ 23 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేసిందని, ప్రభుత్వం అంతకంటే ఎక్కువ 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) రూపంలో ఇస్తున్నందున.. దాన్నే ఫిట్మెంట్గా భావించాలని స్పష్టంగా చెప్పారు. ఇంకా ఉద్యోగ సంఘాల నాటకాలెందుకు..? నాటి సమావేశంలో వారు లేరా?’’ అని మండిపడ్డారు.
0 Comments:
Post a Comment