విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది.
రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇంకా అప్పులు తీసుకునే పరిధి పెంచే వెసులు బాటు కోసం చట్టాలను సవరించడం ఆందోళనను కలిగిస్తోందన్నారు.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే భావితరాలకు ఆస్తులు ఇవ్వడం అటుంచితే.. మోయలేని అప్పుల భారాన్ని ఇస్తున్నట్టుగా ఉందని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే సమావేశం నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలను గాలికొదిలేసి, ఇష్టానుసారంగా అప్పులు చేయడం వల్ల రాష్ట్రం దివాళా దిశగా పోతోందన్నారు. దివాళా వైపు పయనిస్తున్న రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. పెట్టుబడులు లేకపోతే నిరుద్యోగం పెరిగి యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. సంక్షేమ పథకాలపై ముందు ప్రజల్లో మార్పు రావాలని.. అప్పుచేసి సంక్షేమ పథకాలు నిర్వహించడం వల్ల ఆ భారం రానున్న కాలంలో భావితరాలపైనే పడుతుందని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment