పీఆర్సీ నివేదిక ఇవ్వడంలో ఏపీ సర్కార్ జాప్యం: వెంకట్రామిరెడ్డి
అమరావతి: కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్టుగా ఇవాళ జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కాదని.. ఆర్థిక శాఖ అధికారుల సమావేశం మాత్రమేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామి రెడ్డి అన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, ఈహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు చెప్పారు. తక్షణమే అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చారన్నారు. పీఆర్సీపై స్పష్టత వస్తుందని భావించామని.. అయితే నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖలో పెండింగులో బకాయిలు మార్చి 30లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. తదుపరి సమావేశంలో పీఆర్సీ నివేదికపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం పీఆర్సీ నివేదిక కోసమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ఉద్యోగులతో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
0 Comments:
Post a Comment