మేమే విచారిస్తాం...! : మూడు రాజధానుల కేసులో స్పష్టం చేసిన ధర్మాసనం. ఇకపై రోజువారి విచారణ
ప్రజాశక్తి-అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తామే విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
సోమవారం నుండి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా త్రి సభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చింది. గత ప్రభుత్వం ఆ ఇద్దరు న్యాయమూర్తులకు రాజధాని ప్రాంతంఓ తక్కువ ధరలకు స్థలాల నిచ్చిందని, చదరపు గజం 5 వేల రూపాయల చొప్పున ఒకొక్కరికి 600 చదరపు గజాలు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది.
అప్పటి ప్రభుత్వంతో లబ్ది పొందిఉన్నందున ఆ ఇరువురు న్యాయమూర్తులు విచారణ చేయకూడదని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సైతం ఇదే వాదన చేశారు. న్యాయం చేయడమే కాకుండా చేసినట్లు కనబడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ అభ్యర్థనను సీఫ్జస్టిస్ పీకే మిశ్రా తోసిపుచ్చారు.
తాను కూడా ప్రభుత్వం నుంచే జీతం పొందుతున్నానని, అలాంటప్పుడు కేసు విచారణ తాను కూడా చేయకూడదని అన్నారు. ఏదో ఒక కారణం చెప్పి విచారణ చేయకూడదంటే ఎలాగని ప్రశ్నించారు. 'మేమే విచారణ చేస్తాం. మేము ముగ్గురం ఉన్న బెంచే విచారణ కొనసాగిస్తుంది.' అని ఆయన స్పష్టం చేశారు.
దీనిపై స్పందించిన దవే.. తమ పిటిషన్పై ఉత్తర్వులు వెలువరిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తమ అభ్యంతరాన్ని వ్యతిరేకించినట్లు ప్రకటించడం కాదని, రాతపూర్వకంగా చెప్పాలని కోరారు. తుది తీర్పులో దీనిపై ఉత్తర్వులు ఇస్తామని సీజే చెప్పారు.
అంతా విన్న తర్వాత తీర్పు చెప్పేశాక అభ్యంతరంపై ఉత్తర్వులు ఇస్తే ఉపయోగం ఏమిటని దవే ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఏడాదిగా కేసులో కదలిక లేదని చెప్పారు. దీని ప్రభావం అభివృద్దిపై పడినట్లు కనిపిస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఇకపై రోజువారీ విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే, ఇద్దరు న్యాయమూర్తులపై తాము లేవనెత్తి అభ్యంతరాలను రికార్డు చేయాలని దవే కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. తొలుత న్యాయవాది సింహంభట్ల శరత్కుమార్ వాదిస్తూ, తాను కూడా అదే తరహా అభ్యంతరం చెబుతూ పిటిషన్ వేస్తే ఇప్పటి వరకూ విచారణ జరగలేదన్నారు. . సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ ఒక సారి రాజధాని ఖరారైన తరువాత దానిని మార్చడానికి వీలు లేదని చెప్పారు.
రైతు పరిరక్షణ సమితి తరపున వాదించిన ఆయన రాజధానిగా ప్రకటన అనంతరం అమరావతిలో ఎంతో డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. 29 గ్రామాలకు చెందిన 30 వేల మంది రైతులు రాజధాని కోసం భూములిచ్చారని తెలిపారు. శివరామ కృష్ణ కమిటీ చేసిన అధ్యయనంలో కూడా 52 శాతం మంది అమరావతిని రాజధానిగా చేయాలని కోరారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం నాడు కూడా విచారణ జరగనుంది.
అమరావతి 'మాస్టర్ ప్లాన్'ను మార్చడానికి వీల్లేదు
రాజధాని మార్చితే భూములిచ్చిన రైతుల హక్కులను హరించినట్లే
హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు
రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ ప్రారంభం
ఈనాడు - అమరావతి
లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని 'రాజధాని రైతు పరిరక్షణ సమితి' తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఏపీ విభజన చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ కమిటీ అధ్యయనంలో 52 శాతం ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య, 10.72 శాతం మంది విశాఖపట్నం వద్ద రాజధానికి మద్దతు తెలిపారన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. మూడు రాజధానుల శానసం చేసే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం చేసి చట్టబద్ధంగా రూపొందించిన అమరావతి మాస్టర్ప్లాన్ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ.. రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొంతమంది రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానం (వీడియో కాన్ఫరెన్స్, భౌతిక పద్ధతి)లో సోమవారం రోజువారీ తుది విచారణ ప్రారంభించింది. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఉద్దేశపూర్వకంగా ఘోస్ట్ సిటీగా మార్చారు
శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. మూడు రాజధానుల నిర్ణయం అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమేనన్నారు. 'అమరావతి కోసం 29 గ్రామాలకు చెందిన 30 వేల రైతు కుటుంబాలు జీవనాధారాన్ని త్యాగ్యం చేశాయి. అందులో 26,700 మంది చిన్నరైతులే. భూములిచ్చినందుకు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్లాట్లకు.. మూడు రాజధానులొస్తే విలువ లేకుండా పోతుంది. విభజన చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది. మూడు రాజధానుల గురించి లేదు. అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకచోటే ఉండాలి. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణంలో రూ.5,674 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ విస్మరిస్తూ.. వివిధ ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడ వదిలేసింది. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతాన్ని దెయ్యాల నగరం (ఘోస్ట్ సిటీ)గా మార్చేసింది. వివిధ కమిటీలతో అధ్యయనం చేయించి మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి దానికి న్యాయబద్ధత ఉన్నట్లు చూపించే యత్నం చేసింది. ఓసారి నిర్ణయం జరిగిన రాజధాని విషయంలో అధ్యయనం చేయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు' అని అన్నారు.
ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవాలి..
ఈ వ్యాజ్యాలపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రతో త్రిసభ్య ధర్మాసనంలో భాగస్వాములైన ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి తప్పుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సీజే తోసిపుచ్చారు. సోమవారం విచారణలో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్దవే ఆన్లైన్లో వాదనలు వినిపించారు. త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతిలో ప్లాట్ల కేటాయింపు జరిగిందన్నారు. తుది తీర్పు న్యాయమూర్తుల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నప్పుడు విచారణకు అనర్హులవుతారని, కాబట్టి వారు తప్పుకోవాలన్నారు. ఆ వాదనలపై సీజే ప్రశాంత్కుమార్ మిశ్ర తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్లాట్ల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వ విధాననిర్ణయమని, అది ఆర్థిక ప్రయోజనం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం అందుతుంది కాబట్టి నేను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఏదో ఒక కారణం చూపుతూ విచారణ నుంచి తప్పుకోవాలంటే.. విచారణలు జరపడం కష్టమవుతుందన్నారు. ప్రభుత్వమే ఇలా కోరడం దురదృష్టకరమని, దీన్ని అనుమతిస్తే ప్రతిఒక్కరూ అలాగే కోరే ప్రమాదం ఉందంటూ పిటిషన్ను తోసిపుచ్చారు. ఏపీ హైకోర్టు విచారణపైఅభ్యంతరం ఉంటే సుప్రీంను ఆశ్రయించి ఇతర హైకోర్టులో విచారణ కోసం అభ్యర్థించొచ్చని తేల్చిచెప్పారు. ఇదే అంశంపై తన పిటిషన్ విచారణకు నోచుకోలేదని మరో న్యాయవాది శరత్కుమార్ కోర్టుకు తెలిపారు.
అభివృద్ధి స్తంభించిపోయింది: దుష్యంత్దవే స్పందిస్తూ పిటిషనర్ల వాదనలు పూర్తయ్యాక భౌతికంగా హాజరై వాదనలు చెబుతామన్నారు. దానికి అభ్యంతరం లేదన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని పేర్కొంది. అందువల్ల వరుసగా విచారణ జరుపుతామన్నారు.
0 Comments:
Post a Comment