Provident Fund: దీపావళి ముందే.. పీఎఫ్ వడ్డీ జమ!
ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్ఓ
దిల్లీ: పండుగల వేళ పీఎఫ్ చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పనుంది. పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-2021) గాను అందించే వడ్డీని దీపావళి ముందే వారి ఖాతాల్లో జమచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 6కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుంది.
పీఎఫ్ చందాదారులకు 2020- 2021 ఆర్థిక సంవత్సరానికి 8.5శాతం వడ్డీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కార్మికశాఖ కూడా సమ్మతి తెలిపింది. దీంతో 8.5శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు త్వరలోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీపావళి కన్నా ముందే చందాదారులకు ఖాతాల్లో వీటిని జమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న వడ్డీ రేటు (8.5) గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2018లో 8.55 శాతం వడ్డీ ఇవ్వగా.. 2019లో 8.35శాతం అందించింది. అయితే, కొవిడ్ సమయంలో విత్డ్రాలు పెరగడం, చందాదారులకు నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడం వల్లే ఈసారి తక్కువ వడ్డీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి అనుకుంటే..
వడ్డీ రేటు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. వడ్డీకి జమ చేసిన విషయాన్ని ఈపీఎఫ్ఓ చందాదారుల ఫోన్కు మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. చందాదారుడే మెసేజ్ చేసి తెలుసుకోవాలి అని అనుకుంటే.. పీఎఫ్లో రిజిస్టరైన నంబర్ నుంచి ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి 7738299899 మొబైల్ నంబరుకు మెసేజ్ చేయాలి. లేదా 011-22901406 నంబర్కు మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఫేక్ కాల్స్పై జాగ్రత్త..
ఇదే సమయంలో సైబర్ క్రైంకు సంబంధించిన మోసాలపై చందాదారులు అప్రమత్తంగా ఉండాలని ఈపీఎఫ్ఓ సూచించింది. యూఏఎన్, ఆధార్, పాన్కార్డు నంబర్లతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదని హెచ్చరించింది. వీటికి సంబంధించి ఈపీఎఫ్ఓ ఫోన్లో ఎటువంటి సమాచారం సేకరించదని స్పష్టం చేసింది. ఈ వివరాలను కోరుతూ ఎవరైనా ఫోన్ చేస్తే వారిని అనుమానించాల్సిందేనని హెచ్చరించింది.
0 Comments:
Post a Comment