KERALA : కొందరు తల్లిదండ్రులు తమకు ఆడపిల్లలు పుడితే భారంగా భావిస్తుంటారు. కానీ ఆ దంపతులు అలా అనుకోలేదు. తమ కూతుర్లే తమకు బలం అనుకున్నారు. తమ స్థోమత గురించి, వారి పెళ్లిళ్ల గురించి ముందే ఆలోచించి బాధపడలేదు.
వారికి చదువు చెప్పించి వారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్నారు. ఫలితంగా ఆ తల్లిదండ్రులు అనుకున్నదే జరిగింది. తమ పిల్లలు అందరూ బాగా చదివి.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు డాక్టర్లు అయ్యారు. దీంతో ఆ తండ్రి కన్న కలలు నెరవేరాయి. అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి.
ఆ నమ్మకమే ఈరోజు నిజమైంది...
కేరళలోని కోజికోడ్ జిల్లా నాదాపురానికి చెందిన అహ్మద్ కున్హమ్మద్ కుట్టి మరియు జైనా అహ్మద్ దంపతులు. వీరికి ఆరుగురు సంతానం. అందరూ అమ్మాయిలే. కొడుకులు లేరని వీరు ఎప్పుడూ బాధపడలేదు. కూతుర్లే తమ బలం అని అహ్మద్ గట్టిగా నమ్మాడు. ఆయన ఒక ప్రగతిశీల ఆలోచనాపరుడు. తన కుమార్తెలకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు. వారంతా సమాజానికి మెరుగైన సేవలందిస్తారని నమ్మాడు. అనుకున్నట్టే తన ఆరుగురు కుమార్తెలు తమ చదువులో బాగా రాణించి డాక్టర్లుగా కొనసాగుతున్నారు.
నలుగురు కూతుర్లు ఫాతిమా అహ్మద్ (39), హజ్రా అహ్మద్ (33), అయేషా అహ్మద్ (30), మరియు ఫైజా అహ్మద్ ఇప్పటికే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రైహానా అహ్మద్ (23) చెన్నైలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, చిట్టచివరి కూతురు అమీరా అహ్మద్ మంగళూరులో ఎంబీబీఎస్ కోర్సు ఫస్ట్ ఇయర్ చదువుతోంది..
ఇక్కడ ఆసక్తికర విషయం ఎంటంటే ఫాతిమా, హజ్రా, అయేషా మరియు ఫైజాలకు వివాహం జరిగింది. వీరి భర్తలు రిషద్ రషీద్, అజ్నాస్ మహమ్మద్ అలీ, అబ్దురహ్మాన్ పాడియాత్ మనపట్ మరియు అజాస్ హరూన్ కూడా వైద్యులే కావడం విశేషం.
అయితే, అహ్మద్ను పెళ్లిచేసుకున్నప్పుడు జైనాకు కేవలం 12 ఏళ్లు. అప్పుడు అతను చెన్నైలో వ్యాపారం చేస్తున్నాడు. వారికి మొదటి కూతురు పుట్టాక అహ్మద్ తన భార్య కుమార్తెతో బతుకుదెరువు కోసం కలిసి ఖతార్ వెళ్లాడు, అక్కడ ఒక ఆయిల్ రిఫైనరీలో ఉద్యోగం చేశాడు.
అయితే, మొదటి కూతురు హజ్రా BDS కోర్సు చేశాక.. ఆమెను చూసి మిగిలిన వారందరూ MBBSను ఎంచుకున్నారని సమాచారం. ఇలా అందరూ వైద్యకోర్సులో చేరాక.. దాదాపు 35ఏళ్ల తర్వాత అహ్మద్ కుటుంబం తిరిగి కేరళకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత రెండేళ్లకు అహ్మద్ గుండె నొప్పితో మరణించాడు. అప్పటికి ఇద్దరు కూతుర్లకు మాత్రమే వివాహం జరగగా... ఆ తర్వా జైనా తన కూతుర్లకు చదువు చెప్పించి మరో ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. మిగిలిన ఇద్దరు కూతుర్ల చదువు పూర్తయ్యాక వారికి కూడా వివాహం చేయనున్నట్టు జైనా తెలిపింది.
0 Comments:
Post a Comment