✍యంత్రాలు లేకుండా బయోమెట్రిక్ హాజరు ఎలా?
♦ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు
🌻ఈనాడు-అమరావతి
జిల్లాలో 20 శాతం పాఠశాలల్లో మినహా మిగిలిన చోట్ల బయోమెట్రిక్ యంత్రాలు లేవు. ఉన్నా అవి పని చేయడం లేదు. యంత్రాలు పంపిణీ చేయకుండా నూరు శాతం వేలిముద్రల హాజరు (బయోమెట్రిక్) వేయావాలని సూచిస్తూ జిల్లా విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దీని అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలను ఆదేశించడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. గతంలో బయోమెట్రిక్ యంత్రాలతో హాజరు వేసుకునే విధానం ఉంది. అప్పట్లో పర్యవేక్షణ బాధ్యతలను కార్వే కన్సల్టెన్సీ సంస్థ చూసింది. ఆ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు కావడంతో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొంది. అప్పటి నుంచి వాటి పని తీరును పట్టించుకునే వారు కరవయ్యారు. చాలా యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. ఏడాదిన్నర నుంచి కొవిడ్ కారణంగా పాఠశాలలు తక్కువ పని దినాలే పని చేయడంతో దీనికి ప్రాధాన్యమివ్వకుండా మాన్యువల్గానే హాజరు వేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఒకే యంత్రంలో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకుంటే వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని మినహాయింపు ఇచ్చారు.
♦కలెక్టర్ ఆదేశాలతో..
ప్రభుత్వం ఇటీవల అన్ని హెచ్వోడీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. జిల్లాల్లో దీని అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. దీంతో జిల్లా పాలనాధికారి వివేక్యాదవ్ ఆదేశాల మేరకు కొద్ది రోజుల నుంచి అన్ని శాఖాధికారుల కార్యాలయాల్లో ఉద్యోగులు బయోమెట్రిక్ యంత్రాల్లో హాజరు వేయాలని సూచించారు. ఇందులో భాగంగా మూడు రోజుల నుంచి డీఈవో కార్యాలయంలో అమలు చేస్తున్నారు. హాజరు నమోదుకు డివైస్లు, అందులో సాఫ్ట్వేర్ను ఎన్ఐసీ అధికారులు ఇవ్వడంతో ఇన్స్టాల్ చేసుకున్నారు. కార్యాలయ ఉద్యోగులందరూ ఉదయం 10.45 గంటలకు వస్తున్నారు. ఈ విధానం విజయవంతం కావడంతో పాఠశాలలకు విస్తరించాలని సోమవారం స్పందన సమీక్షలోనే కలెక్టర్ డీఈవోకు స్పష్టం చేశారు. ఆమె మంగళవారం అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు పాఠశాల స్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశాడు. ప్రతి ఉపాధ్యాయుడు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఉన్నత పాఠశాల్లో సగటున 10-15 మంది ఉపాధ్యాయులు ఉంటారు. వారంతా యంత్రాల్లో హాజరు వేసుకోవడానికి సర్వర్ సమస్యలు లేకపోతే కనీసం అర గంటపైన పడుతుంది. ప్రస్తుతం ఉన్న అరకొర యంత్రాలు.. మరమ్మతులకు గురైన వాటితో హాజరు వేసుకోవడానికి ఎన్ని గంటలు కుస్తీ పట్టాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. యంత్రాల సమస్యకు పరిష్కారం చూపకుండా సర్క్యులర్ ఇస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని వివరించకుండా దాని అమలుకు అంగీకరించడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. తాము కలెక్టర్ను కలవడమో లేదా డీఈవో ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామని ఒక సంఘం నాయకుడు ‘ఈనాడు’కు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,650 పాఠశాలలు ఉన్నాయి. కనీసం 8 వేల యంత్రాలు అవసరమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కొత్త డివైస్లు, సర్వర్ సమస్యలు లేకుండా చర్యలు తీసకుకుంటే తమకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవడానికి అభ్యంతరం లేదని ప్రధానోపాధ్యాయ సంఘం వర్గాలు తెలిపాయి.
0 Comments:
Post a Comment