కరోనా సమయంలో కరెంట్ వినియోగం తగ్గిపోయింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకవడంతో.. మళ్లీ అన్ని సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి.. దీంతో
విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతోంది. ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోతోంది. చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి. ఇదే సమయంలో.. భారత్కు విద్యుత్ సంక్షోభం తప్పదనే హెచ్చరికలున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. దేశంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని.. సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది కేంద్రం. ప్రస్తుతం గల కొరతకు కారణాలను సైతం వివరించిన కేంద్రం.. ఈ నెల 7వ తేదీన కోల్ ఇండియా 1.501 మిలియన్ టన్నులు సరఫరా చేసిందని, దానివల్ల వినియోగం, సరఫరా మధ్య దూరం తగ్గిపోయిందని విద్యుత్తుశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.. ఇక, రానున్న 3 రోజులపాటు రోజుకు 1.6 మిలియన్ టన్నులు, ఆ తర్వాత రోజుకు 1.7 మిలియన్ టన్నులు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా, కేంద్ర బొగ్గు శాఖ హామీ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు.. కొరతకుగల కారణాలను వివరిస్తూ.. విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొంది విద్యుత్తుశాఖ.. అందులో ఒకటి ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తర్వాత విద్యుత్కు డిమాండ్ పెరగడం.. రెండోది సెప్టెంబర్ నెలలో బొగ్గుగనుల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం, మూడోది దిగుమతి చేసుకొనే బొగ్గు ధరలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడం.. నాల్గోది వాటి ప్రభావంతో దిగుమతి బొగ్గుతో చేసే విద్యుత్తు ఉత్పత్తి భారీగా పడిపోవడంగా తన ప్రకటనలో పేర్కొంది కేంద్ర విద్యుత్ శాఖ. ఇక, 2019లో నెలకు 106.6 బిలియన్ యూనిట్ల మేర ఉన్న విద్యుత్తు వినియోగం, 2021లో 124.2 బిలియన్ యూనిట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది. మరోవైపు బొగ్గు ఆధారిత ఉత్పత్తి 61.91 శాతం నుంచి 66.35 శాతానికి చేరిందని.. దీంతో.. ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో బొగ్గు వినియోగం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 18 శాతం పెరిగిందని చెప్పుకొచ్చింది.
0 Comments:
Post a Comment