AP: నియామకాల కేలెండర్ సిద్ధం.. రేపు కొన్నింటికి నోటిఫికేషన్
జాతీయ ప్రమాణాలతో వైద్య సిబ్బంది!
176 పీహెచ్సీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి: సీఎం
డిసెంబరుకు అన్ని పోస్టుల భర్తీ
వివిధ ఆస్పత్రుల్లో నియామకాలు వెంటనే పూర్తి చేయాలి: జగన్ ఆదేశం
అమరావతి(ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రమాణాలను అనుసరించి బోధనాస్పత్రులు, ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఇందులో ఎలాంటి రాజీకి ఆస్కారం లేదన్నారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బంది నియామకంపై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో నియామకాలు వెంటనే పూర్తిచేయాలని నిర్దేశించారు. గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల కేలెండర్ను రూపొందించామని అధికారులు సీఎంకు తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో పోస్టుల భర్తీకి బుధవారం (20న) నోటిఫికేషన్ ఇస్తామని.. ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 10న నియామక ఉత్తర్వులిస్తామని వెల్లడించారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 5 నాటికి, వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)లో డిసెంబరు 21-25 తేదీల మధ్య నియామక ఉత్తర్వులిస్తామన్నారు. కొత్తగా నిర్మించదలిచిన 176 పీహెచ్సీల నిర్మాణంపై వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపు తగ్గుముఖం పట్టాయని.. అన్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు శశిభూషణ్, అనిల్కుమార్ సింఘాల్, ముద్దాడ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment