టీచర్లపై నమ్మకం లేదా?
విద్యార్థులకు బయోమెట్రిక్పై అసంతృప్తి
ఇప్పటికే 2 ప్రక్రియల్లో హాజరు నమోదు
చాలదన్నట్టు బయోమెట్రిక్ పనీ అప్పగింత
భారమేకాదు...
ఇది టీచర్లనుఅనుమానించడమే
అమ్మఒడికి 75శాతం హాజరుపై సర్కారు తీరు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి చేసిన ప్రభుత్వం... ఆ విషయంలో అనుసరిస్తున్న వైఖరి పట్ల ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా హాజరును ప్రతి తరగతిలోనూ ఉపాధ్యాయులు తీసుకుంటారు. హాజరుపట్టీల్లో తీసుకున్న హాజరును ఏరోజుకారోజు ప్రభుత్వం ఇచ్చిన యాప్లలో ఉపాధ్యాయులు అప్లోడ్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల హాజరు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయాలని పేర్కొంది. బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర వేసేందుకు...దాన్ని అప్లోడ్ చేసేందుకు ఒక యాప్ రూపొందించారు. ఉదయం రాగానే విద్యార్థులు ఈ యాప్లో వేలిముద్రలు వేసి హాజరైనట్లు నిర్ధారించాలి. అంటే హాజరుపట్టీలో హాజరు తీసుకోవడం, ఆ హాజరును ఇప్పటికే ఉన్న యాప్లో అప్లోడ్ చేస్తుండగా...ఇప్పుడు మళ్లీ బయోమెట్రిక్ పద్ధతి పెట్టనున్నారు. ఒకరకంగా ఇది హాజరుపట్టీ ద్వారా హాజరు తీసుకుని, యాప్లో అప్లోడ్ చేస్తున్న తమను అవమానించడమేనని కొందరు టీచర్లు వాపోతున్నారు. ఒక విద్యార్థికి మూడుసార్లు హాజరుతీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు యాప్లలో నమోదు వ్యవహారం కొంత ఇబ్బందిగానే మారింది. హాజరు అప్లోడ్, మధ్యాహ్న భోజన సమయంలో పదార్థాల అప్లోడ్, మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్...ఇలా బోధనేతర పని చాలానే ఉంది. ఇప్పుడు మళ్లీ మూడోసారి బయోమెట్రిక్తో విద్యార్థుల హాజరు తీసుకోవడం ఒక అదనపు పనే. తాము హాజరుపట్టీ ద్వారా తీసుకున్న హాజరునే ప్రామాణికంగా తీసుకోవచ్చని, అదీ కాకుంటే తాము అప్లోడ్ చేస్తున్న హాజరు వివరాలు ప్రభుత్వం వద్దే ఉంటాయని... వాటినైనా పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు. మళ్లీ ఇప్పుడు ఏదో ఉద్యోగులకు పెట్టినట్లుగా విద్యార్థులకు బయోమెట్రిక్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఈ పద్ధతి పెట్టినా అమలుకాలేదని, ఇప్పుడు మళ్లీ అమలు చేస్తాననడ ంలో ఆంతర్యమేంటని అడుగుతున్నారు.
0 Comments:
Post a Comment