The Bactrian Treasure: ఆ ప్రాచీన ‘బ్యాక్ట్రియన్ ఖజానా’ తాలిబన్లకు దక్కేనా..?
* పురావస్తు ప్రేమికుల ఆందోళన
The Bactrian Treasure: ఆ ప్రాచీన ‘బ్యాక్ట్రియన్ ఖజానా’ తాలిబన్లకు దక్కేనా..?
అఫ్గానిస్థాన్ను తాలిబన్ మూకలు పూర్తిగా ఆక్రమించుకొన్నాయి. దీంతో వివిధ దేశాల్లో ఉన్న అఫ్గాన్ రిజర్వులు, బంగారాన్ని ఆయా దేశాలు స్తంభింపజేశాయి. దీంతో భవిష్యత్తులో తాలిబన్లు పాలనకు నిధులు లేక కటకటలాడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారు డబ్బు కోసం ఆవురావురు మంటూ వెతుకుతున్నారు. విదేశీ సాయం రూపంలో నిధులు వస్తాయని ఆశిస్తూ.. తాము మారిపోయిన తాలిబన్లుగా ప్రచారం చేసుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యంత పురాతన స్వర్ణ నిధి ‘బ్యాక్ట్రియన్ ట్రెజరీ ’ ఒకటి తాలిబన్ల రాజ్యంలోనే చిక్కుకుపోయింది. అఫ్గాన్లో అవినీతి తీరు చూసి కొందరు నాయకులు దానిని తరలించాలని చూసినా అది సాధ్యం కాలేదు. అఫ్గాన్ కేంద్ర బ్యాంక్ ఆధీనంలో ఉన్న ఆ ఖజానాను తాలిబన్లు ఏం చేస్తారో అని పురావస్తు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
ఏమిటీ బ్యాక్ట్రియన్ ఖజానా..!
సోవియట్ యూనియన్ ఆక్రమించడానికి కొన్నేళ్ల ముందు సోవియట్-అఫ్గాన్ పురావస్తు పరిశోధన బృందం ఉత్తర అఫ్గాన్లో జ్వాజియన్ ప్రావిన్స్లోని తిల్యా తెపే (గోల్డెన్ హిల్)అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. దీనికి గ్రీక్-రష్యన్ పురావస్తు శాస్త్రవేత్త విక్టోర్ సరియాందీ నేతృత్వం వహించారు. అక్కడ వారికి ఓ భారీ ఖజానా బయటపడింది. దీనిలో 20,600 వస్తువులు లభించాయి. బంగారు ఆభరణాలు, నాణేలు, బొమ్మలు, వస్తువులు ఉన్నాయి. వారు ఆరు సమాధులను కూడా కనుగొన్నారు. ఇవన్నీ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. భారత్లో ఏనుగు దంతాలతో తయారైన కళాఖండాలు కూడా వాటిల్లో ఉన్నాయి.
ఈ తవ్వకాల బృందానికి నేతృత్వం వహంచిన విక్టోర్ బ్యాక్ట్రియన్ నాగరికతపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఈ నేపథ్యంలో అతను ఆ ప్రాంతం పురావస్తు సంపదకు గని వంటిదని భావించాడు. 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ బ్యాక్ట్రియన్ను ఆక్రమించాడు. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంతం పలు దండయాత్రలను చవిచూసింది. దీంతో పలు సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి.
సోవియట్ ఆక్రమణ తర్వాత నుంచి పతనం..
తవ్వకాల నుంచి సేకరించిన ఖజానాను కాబుల్లోని నేషనల్ మ్యూజియానికి చేర్చారు. ఆ తర్వాత సోవియట్ దురాక్రమణ జరిగింది. అప్పటి నుంచి ఈ మ్యూజియంపై పలుమార్లు దాడులు జరిగాయి. మ్యూజియంలోని 70శాతం సంపద దోపిడీకి గురైంది. వీటిల్లో బ్యాక్ట్రియన్ నిధి వస్తువులు కూడా ఉన్నాయి.
1988లో అఫ్గాన్ నుంచి సోవియట్ విరమించుకొన్నా.. వారు ఏర్పాటు చేసిన నజీబుల్లా ప్రభుత్వం బ్యాక్ట్రియన్ సంపద భద్రపర్చేందుకు మ్యూజియం సరైన ప్రదేశం కాదని భావించింది. దీనిని 1989లో అఫ్గాన్ అధ్యక్ష భవనంలోని కేంద్ర బ్యాంక్ వాలెట్కు తరలించినట్లు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ పేర్కొంది.
ఖజానా తెరవాలంటే ఐదు తాళాలు ఉండాల్సిందే..!
బీబీసీ మాత్రం మ్యూజియం డైరెక్టర్ ఒమర్ ఖాన్ మసూదీ దీనిని భద్రపర్చినట్లు వెల్లడించింది. ఆ నిధి తెరవాలంటే ఐదు తాళాలు వాడాల్సిన అవసరం ఉందని తన కథనంలో పేర్కొంది. ఒమర్ వద్ద ఒక తాళం ఉండగా మిగిలినవి వేర్వేరు వ్యక్తుల వద్ద ఉన్నాయి. వారు ఆ తాళాలు అఫ్గాన్ ముఠానాయకులు, తాలిబన్ల చేతిలో పడకుండా కాపాడారు. 1996లో అధికారం చేపట్టిన తాలిబన్లకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
తాళం ఉన్న వ్యక్తి మరణిస్తే.. దానిని అతని సంతానంలో పెద్దవారికి అందజేయాలనేది నిబంధన. 2003లో అమెరికా తాలిబన్లను పూర్తిగా తరిమికొట్టాక ఈ నిధి సురక్షితంగా ఉందన్న విషయాన్ని పౌర ప్రభుత్వం బయటకు వెల్లడించింది.
పేద దేశానికి ఆదాయ వనరుగా..
ఖజానా విషయం బయటకు వెల్లడించిన పౌర ప్రభుత్వం దీనిని 2006 నుంచి 13 సార్లు విదేశాల్లో ప్రదర్శనలకు పెట్టింది. పారిస్లో తొలిసారి ప్రదర్శించారు. చివరిసారిగా 2020లో హాంకాంగ్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనల ద్వారా అఫ్గాన్ ప్రభుత్వానికి 4.5 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.
ఖజానా వేరే చోట భద్రపర్చాలన్న చర్చ..
అఫ్గానిస్థాన్లోని అవినీతి బ్యాక్ట్రియన్ సంపదకు ముప్పుగా మారుతుందని నాటి దేశ దిగువ సభ సభ్యుడు మిర్ రహ్మన్ రెహ్మానీ ఈ ఏడాది జనవరిలో పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మకమైన దేశం వద్ద భద్రపర్చాలని ఆయన కోరారు. కానీ, సాంస్కృతిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు పోలేదు. ఇప్పుడు ఆ వారసత్వ సంపద తాలిబన్ల చెరలో ఉంది. అది వారి కంట పడితే.. ఏం చేస్తారోనని పురావస్తు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
0 Comments:
Post a Comment