ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా 35%
చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్
ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యలో ప్రభుత్వం పలు మార్పులు తెస్తోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. వీటికి ప్రత్యేక రుసుములను నిర్ణయిస్తారు. సాధారణ పీజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణతో పాటు, యాజమాన్య కోటాను 30% చేయనున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా రుసుములను కన్వీనర్ కోటా కంటే మూడు రెట్లు పెంచనున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే వీటన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రైవేటులో ఇలా..
ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీచేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. మిగతా 65% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని భావించినా సమయం లేకపోవడంతో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీచేసే సీట్లకు ప్రత్యేక బోధన రుసుములను ఖరారు చేస్తారు. ఈ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం రుసుములు చెల్లిస్తుంది. 65% యాజమాన్య కోటాకు రుసుముల విషయమై యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇస్తారు. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్తో పాటు సాధారణ డిగ్రీ, వృత్తివిద్యా పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు ఉన్నాయి.
సాధారణ పీజీల్లో 70% కన్వీనర్ కోటా
సాధారణ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈసారి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశపరీక్ష, సీట్ల భర్తీ ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. ఇప్పటివరకూ విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించి, సీట్లు భర్తీ చేస్తుండగా.. ఈ ఏడాది నుంచి ఏకీకృత విధానం తీసుకురానున్నారు. యాజమాన్య కోటా సీట్లకు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నాయి. కొన్ని కోర్సులకు 20%, మరికొన్నింటికి 25%, ఇంకొన్నింటికి 30% యాజమాన్య కోటా ఉంది. దీన్ని ఏకీకృతం చేస్తూ అన్ని కళాశాలల్లో యాజమాన్య కోటా 30% చేయనున్నారు. ఉన్నతవిద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ఉన్నత విద్యామండలి భర్తీ చేస్తుంది.
యాజమాన్య కోటా రుసుముల పెంపు
ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా రుసుములు పెరగనున్నాయి. కన్వీనర్ కోటా కంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేసుకునేందుకు యాజమాన్యాలను అనుమతించే అవకాశం ఉంది. దీనిపై ఉన్నతవిద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఆమోదిస్తే ఈ ఏడాది అమల్లోకి వస్తుంది. ఈ కోటాలో విద్యార్థులకు సీట్లను ఉన్నత విద్యామండలి కేటాయిస్తుంది.
0 Comments:
Post a Comment