Pariksha Pe Charcha 2021: ఈ నెల 7న 'పరీక్షా పే చర్చ'.. వీక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..
PM Narendra Modi - Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు నిర్వహించే 'పరీక్షా పే చర్చ' నాలుగో ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 7న జరగనుంది. బుధవారం సాయంత్రం 7గంటలకు ప్రధాని మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పరీక్షలపై చర్చ నిర్వహించనున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2021 సంవత్సరానికి గానూ ఆన్లైన్ ద్వారా పరీక్షా పే చర్చ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం 7 గంటలకు జరిగే 'పరీక్షా పే చర్చను వీక్షించాలంటూ సోమవారం ట్విటర్ వేదికగా కోరారు. ''మా ధైర్యవంతులైన పరీక్షా యోధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కొత్త పద్ధతిలో, విస్తృత అంశాలపై ఆసక్తికర ప్రశ్నలతో జరగనున్న చిరస్మరణీయమైన పరీక్ష పే చర్చను ఏప్రిల్ 7న సాయంత్రం 7 గంటలకు చూడండి'' అంటూ అని ప్రధాని ట్వీట్ చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిస్తారు.
పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీలు కుదరలేదు. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. విద్యార్థులతో మాట్లాడి వారి భయాందోళనలను తొలగిస్తారని ఇటీవల విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలను పొగొట్టేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని ప్రభుత్వం దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
0 comments:
Post a comment